మరో 18 దేశాలకు విమాన సేవలు - పాక్ తప్ప ఐదు పొరుగుదేశాలకూ - కేంద్ర మంత్రి హర్దీప్ వెల్లడి
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసిన నేపథ్యంలో.. పలు చోట్ల చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే పనిని కేంద్రం ముమ్మరం చేసింది. తాజాగా ఐదు పొరుగు దేశాలు సహా మొత్తం 13 దేశాలతో భారత్.. ఎయిర్ బబుల్(తాత్కాలిక విమానయాన ఒప్పందం) చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం వెల్లడించారు.
వందే భారత్ మిషన్ లో భాగంగానే కొత్తగా 13 దేశాలకు విమాన సర్వీసులపై యత్నాలు ఆరంభించామని మంత్రి తెలిపారు. జులై నుంచే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతార్, మాల్తీవులకు విమాన సేవలు నడుస్తుండగా, తాజా ఒప్పందాల ద్వారా మరో 13 దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్ కొరియా, నైజీరియా, రష్యా, బెహ్రయిన్, ఫిలిప్పీన్స్, ఇజ్రాయెల్, కెన్యా)కు సర్వీసులు పునరుద్ధరించే దిశగా చర్చలు చేస్తున్నామననారు.

కొత్తగా ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోబోయే 13 దేశాలతోపాటు మన పొరుగున ఉన్న ఐదు దేశాలు (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, భూటాన్, నేపాల్)కు కూడా విమాన సేవలను విస్తరించే ఆలోచనలో ఉన్నామని మంత్రి హర్దీప్ చెప్పారు. అయితే, ఎయిర్ బబుల్ జాబితాలో దాయాది పాకిస్తాన్ పేరు మాత్రం లేదు. పాక్ తప్ప మిగతా పొరుగుదేశాలతోనే భారత్ చర్చలు జరుపనుంది.
''వందే భారత్ మిషన్ ద్వారా మరిన్ని దేశాలకు దగ్గరవ్వాలని భారత్ భావిస్తున్నది. చర్చలు సఫలమైతే.. ఆయా దేశాల్లో ఉండిపోయిన మనవాళ్లను ఇంటికి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుంది'' అని విమానయాన మంత్రి అన్నారు. లాక్ డౌన్ కారణంగా నెలలపాటు నిలిచిపోయిన డొమెస్టిక్ సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications