ఆప్ఘన్ భవిష్యత్తు తేల్చనున్న భారత్-రేపు భద్రతా సలహాదారుల భేటీ- పాక్, చైనా గైర్హాజరు
ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భారత ఉపఖండంలో వ్యూహాత్మక భూభాగమైన ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలైన నేపథ్యంలో ఆ దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా చూసేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, చైనా ల ప్రభావం నుంచి దాన్ని బయటపడేసేందుకు వీలుగా రేపు ఈ ప్రాంతంలోని ఆప్ఘన్ పొరుగు దేశాలతో పాటు రష్యా, ఇరాన్ వంటి దేశాలతో జాతీయ భద్రతా సలహాదారుల భేటీ నిర్వహిస్తోంది.
రేపు ఢిల్లీలో జరిగే ప్రాంతీయ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిధ్యమిస్తోంది. ఇందులో ఇరాన్, రష్యాతో పాటు మధ్య ఆసియాలోని పలు దేశాలు హాజరయ్యే అవకాశముంది. ఈ మేరకు పాకిస్తాన్, చైనాతో పాటు ఆయా దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపింది. అయితే పాకిస్తాన్, చైనా మాత్రం ఈ భేటీకి హాజరు కాబోమని తేల్చిచెప్పేశాయి. ఆప్ఘనిస్తాన్ లో తమ ఎత్తులు తాము వేసుకుంటున్న ఈ రెండు దేశాలు జాతీయ భద్రతా సలహాదారుల భేటీకి రాకూడదని తీసుకున్న నిర్ణయం ఊహించిందేనని భారత్ చెబుతోంది.
రేపు జరగబోయే ఎన్ఎస్ఏల భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షత వహించనున్నారు. అత్యున్నత స్థాయి సంభాషణ సంబంధిత భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి, శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మద్దతు ఇచ్చే చర్యలను ఈ భేటీ సమీక్షిస్తుందని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రత, మానవతా సవాళ్లను పరిష్కరించడానికి భారత్ ఏకీకృత అంతర్జాతీయ స్పందనకు పిలుపునిస్తోందని ఈ ప్రకటన తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారతదేశం యొక్క సాంప్రదాయ సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.