చైనా మరో మెలిక.. గాల్వాన్ చేజారిందా? పీపీ14పై ఆర్మీ వ్యూహమిది.. కేంద్రానికి మూడు ప్రశ్నలు
రెండు నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి వాతావరణం కొద్దిగా చల్లబడింది. సైనిక, దౌత్య చర్చల్లో.. గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల బఫర్ జోన్ ఏర్పాటుకు రెండు దేశాలూ అంగీకరించుకోవడం, ఆ మేరకు ఇరువైపుల సైన్యాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి మళ్లడం తెలిసిందే. అయితే చర్చల సారాంశాన్ని వివరిస్తూ చేసిన ప్రకటనలో చైనా మళ్లీ మెలికలు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదమైంది. గాల్వాన్ లోయలోని కీలక ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులు వస్తున్న వేళ.. కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు కీలక ప్రశ్నలు సంధించారు. మరోవైపు గాల్వాన్ లో తిరిగి గస్తీ నిర్వహించడంపై ఆర్మీ వ్యూహరచన చేస్తోంది..

పీపీ14 చైనా లాగేసుకుందా?
1959 ఒప్పందాల ప్రకారం గాల్వాన్ లోయ మొత్తం తనదేనంటూ చర్చల్లో చైనా వాదించిందని, అందుకు భారత్ అంగీకరించకపోయే సరికి గత నెలలో హిసాత్మక ఘర్షణకు దిగి, 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న మరునాడే గాల్వాన్ పై సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుందని, తాజాగా ఎల్ఏసీ నుంచి ఇరు సైన్యాలు వెనక్కి మళ్లాయంటూ రెండు దేశాలూ అధికారిక ప్రకటనలు చేసే సమయానికి గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ14) దగ్గర 800 మీటర్ల భూభాగాన్ని చైనా తన స్వాధీనంలోనే ఉంచుకుందంటూ ప్రఖ్యాత ‘ఇండియా టుడే' సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రక్రియ పూర్తయిన వెంటనే..
గాల్వాన్ లోయపై చైనా పట్టుకు సంబంధించి కేంద్రం నేరుగా స్పందించనప్పటికీ, ఆర్మీ వర్గాల ద్వారా కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి. చర్చల్లో కుదిరిన అంగీకారాల మేరకు.. 3 కిలోమీటర్ల బఫర్ జోన్ నుంచి రెండు వైపుల సైన్యాలు విడతల వారీగా వెనక్కి వెళతాయని, ఇప్పటికే చైనా బలగాలు ఒక కిలోమీటర్ దూరం వెనుదిరిగాయని, ప్రక్రియ సజావుగా పూర్తయి.. ప్రశాంతత నెలకొన్న తర్వాత 14వ పెట్రోలింగ్ పాయింట్ లో తిరిగి గస్తీ నిర్వహించేలా ఆర్మీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అదే ‘ఇండియా టుడే' మరో కథనాన్ని రాసింది. ఈలోపే గాల్వాన్ పై గందరగోళాన్ని మరింత పెంచుతూ చైనా చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.

గాల్వాన్లో తప్పు చేసిందెవరు?
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొత్త కానప్పటికీ, దశాబ్ధాల తర్వాత సైనికులు చనిపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అయినాసరే, శాంతి పంథాను వీడని భారత్.. చర్చల ప్రక్రియతో సమస్యను పరిష్కరించింది. కాగా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జరిపిన ఫోన్ సంభాషపై డ్రాగన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ‘‘గాల్వాన్ లోయలో తప్పొప్పులు ఎవరివనేది చాలా స్పష్టంగా ఉంది. చైనా తన సరిహద్దు ప్రాంతాల ప్రాదేశికతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది'' అని మెలిక వాక్యాలు రాసున్నాయి. చైనా ఇంత బాహాటంగా ప్రకటన చేసినా, ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కేంద్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు.

వీటికి మోదీ సర్కార్ బదులిస్తుందా?
అజిత్ దోవల్ తో చర్చలపై చైనా విడుదల చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ లో షేర్ చేశారు. అలాగే కేంద్రానికి మూడు కీలకమైన ప్రశ్నలు వేశారు. ‘‘1.సరిహద్దులో స్టేటస్ కో(యథాస్థితి) కొనసాగించేందుకు ప్రభుత్వం ఎందుకు పట్టుపట్టలేదు?, 2.మన దేశానికి చెందిన 20 మంది సైనికుల మరణాలను సమర్థించుకోడానికి చైనాకు ఎందుకు అనుమతిచ్చారు?, 3.గాల్వాన్ లోయ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు? వీటికి మోదీ సర్కార్ బదులిస్తుందా?'' అంటూ కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications