పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్ను నమ్మలేమంటూ..
న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా మహమ్మారితో, మరోవైపు ఆ మహమ్మారిని పుట్టించిన చైనాతో సరిహద్దులో భారతదేశం తీవ్రమైన పోరాటం చేస్తోంది. జూన్ 15న చైనా బలగాలు కుట్రపూరితంగా భారత జవాన్లపై పదునైన ఆయుధాలతో దాడులు చేసి 20 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నాయి. భారత దళాలు కూడా చైనా దళాలపై ఎదురుదాడి చేసి ధీటుగా బదులిచ్చాయి. భారత బలగాల దాడిలో సుమారు 45 మంది వరకు చైనా సైనికులు హతమయ్యారు.

పాక్ కంటే చైనానే పెద్ద శత్రువు..
తరచూ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్ కంటే చైనానే భారత్ పెద్ద శుత్రవుగా మారిపోయింది. దీంతో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీ ఓటర్ స్నాప్ పోల్ కీలక విషయాలను వెల్లడించింది. చైనా బలగాలు భారత సైనికులపై దాడులు చేసిన ఘటన తర్వాత కొద్ది రోజులకే ఈ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో చైనాతో వ్యవహరించే తీరుపై భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీపై పూర్తి స్థాయి విశ్వాసాన్ని ఉంచినట్లు తేలింది. ఇప్పుడు పాకిస్థాన్ కంటే చైనా మనదేశానికి పెద్ద శత్రువుగా మారిపోయిందని ప్రజలు భావిస్తున్నారు.

చైనాకు గుణపాఠం చెప్పాల్సిందే..
మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ గతంలోనే చైనా నుంచి పొంచివున్న ముప్పును చాలాసార్లు గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత కాలంలో దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రస్తుతం దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల ఓటర్లే కాకుండా బీజేపీ ఓటర్లు కూడా చైనాకు గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చైనాతో వాణిజ్య విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు చాలవని, మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మోడీపై 89 శాతం ప్రజల విశ్వాసం..
సీవోటర్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీపై పూర్తి విశ్వాసం ఉంచారని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు చైనానే పెద్ద శత్రువుగా కనిపిస్తోందన్నారు. చైనాకు తగినవిధంగా బుద్ధిచెప్పాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా, ఐయాన్స్ సీఓటర్ స్నాప్ పోల్ ప్రకారం.. భారత భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున లభిస్తోంది. దేశంలోని దాదాపు 89 శాతం మంది ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవడం గమనార్హం.

చైనానే మొదటి సమస్య.. ప్రతిపక్షాల కంటే మోడీ ప్రభుత్వంపైనే నమ్మకం
స్నాప్ పోల్ ప్రకారం.. ప్రస్తుతం మనదేశానికి చైనానే మొదటి సమస్యగా మారింది. పాకిస్థాన్ కంటే చైనా భారతదేశానికి పెద్ద సమస్య అని 68.3శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక 37.7 శాతం మంది ప్రజలు పాకిస్థానే పెద్ద సమస్య అని పేర్కొన్నారు. చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు. 60 శాతం మంది ప్రజలు చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. కాగా, 39.8 శాతం మంది మాత్రం ఇప్పటికే చైనాకు భారత్ సరైన జవాబు ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాల కంటే ఎక్కువగానే కేంద్రం ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. దేశ భద్రత విషయంలో మోడీ ప్రభుత్వంపై 73.6 శాతం ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేవలం 16.7 శాతం ప్రజలు మాత్రమే నమ్మకం పెట్టుకున్నారు. చైనా ఘర్షణల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Recommended Video

రాహుల్ గాంధీని నమ్మలేమంటూ 61శాతం..
అయితే, చైనాకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని పోల్ ప్రశ్నించగా.. ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటి చైనా వస్తువులను కొనడం ఆపాలని సామాన్య ప్రజలు అభిప్రాయపడ్డారు. 68.2 శాతం మంది ప్రజలు చైనా ఉత్పత్తులను బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు. కాగా, 31.8 శాతం మంది ప్రజలు మాత్రం చైనా ఉత్పత్తులను కొనుగోలు ఆపడం సాధ్యంకాదని, ప్రజలు చైనా వస్తువులను కొంటూనే ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా, సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో మోడీ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించడం లేదు. దేశ భద్రత విషయంలో రాహుల్ గాంధీని నమ్మలేమంటూ 61.3 శాతం తేల్చి చెప్పారు. ఇక 39 శాతం మంది ప్రజలు ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications