బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక-క్వారంటైన్ రూల్స్ వివక్షే-మీ పౌరుల్నీ రానివ్వమన్న కేంద్రం..
ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నా తమ దేశంలో మాత్రం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని బ్రిటన్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా భారత్ లో వ్యాక్సిన్ వేయించుకున్న వారిపైనా క్వారంటైన్ అస్త్రం ప్రయోగిస్తున్న బ్రిటన్ తీరుపై కేంద్రం ఇవాళ మండిపడింది.
బ్రిటన్ క్వారంటైన్ రూల్స్
కరోనా ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తోంది. తమ దేశంలోకి రావాలంటే ముందుగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. లేకపోతే 10 రోజుల క్వారంటైన్ లో ఉఁడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. దీంతో బ్రిటన్ ఎంపిక దేశాల జాబితాలో ఉన్న భారత్ తో పాటు ఇతర దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమ దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకుని వచ్చే వారిని సైతం క్వారంటైన్ లేకుండా అనుమతించరాదన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయులకు చుక్కలు
భారత్ లో వ్యాక్సిన్ తీసుకుని వచ్చినా సకే తమ దేశంలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తో పాటు పలువురు వీఐపీలు ఇప్పటికే బ్రిటన్ లో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల్ని సైతం రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. భారత్ లో వ్యాక్సిన్ వేయిుంచుకున్న వీరు తిరిగి బ్రిటన్ లో 10 రోజుల క్వారంటైన్ లో ఉండేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో వీరు ఇప్పటికే అంగీకరించిన కార్యక్రమాల నిర్వాహకులు వాటిని రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. దీంతో వీరంతా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
బ్రిటన్ తీరుపై మండిపడిన కేంద్రం
బ్రిటన్ తీసుకొచ్చిన కొత్త క్వారంటైన్ నిబంధనలపై మొదట్లో స్పందించని కేంద్రం.. ఇప్పుడు వీఐపీలకు చుక్కలు కనిపిస్తున్న నేపథ్యంలో స్పందించింది. బ్రిటన్ క్వారంటైన్ విధానం వివక్షాపూరితంగా ఉందని కేంద్రం ఇవాళ ఆరోపించింది. భారత్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని సైతం బ్రిటన్ లో క్వారంటైన్ లేకుండా నేరుగా అనుమతించరాదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయం తమను నిరుత్సాహానికి గురిచేసిందని కేంద్రం తెలిపింది. మన దేశంలో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ నుంచి ఇప్పటికే 5 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు తీసుకుని వాడుకుంటూ ఇప్పుడు అదే వ్యాక్సిన్ వేయించుకోని వారిని ఎలా అనుమతించరని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో బ్రిటన్ ను ప్రశ్నించింది.
Recommended Video
బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయుల్ని క్వారంటైన్ లేకుండా బ్రిటన్ లోకి అనుమతించరాదన్న నిర్ణయం వివక్షా పూరితంగా అభివర్ణించిన విదేశాంగశాఖ .. ఈ వ్యవహారాన్ని అక్కడి విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లేమన్నారు. దీంతో సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారన్నారు. చెప్పిన విధంగా సమస్య పరిష్కారం కాకపోతే తాము కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భారత్ బ్రిటన్ ను హెచ్చరించింది. భారత్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశాలు మన పౌరుల్ని ఆయా దేశాల్లో తప్పకుండా అనుమతించాల్సిందేనని విదేశాంగశాఖ తెలిపింది.