నవెద్ చరిత్ర చెప్పండి: పాక్ను కోరిన భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వం పాకిస్థాన్ కు ఒక లేఖ వ్రాసింది. జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లను హత్య చేసి ప్రాణాలతో పట్టుబడిన మహమ్మద్ నవెద్ వివరాలు ఇవ్వాలని సంప్రధాయ పద్దతిలో భారత్ మనవి చేసింది.
ఈ విషయంపై ఎన్ఐఏ అధికారులు పాక్ కు లేఖ పంపించారు. గత వారం ఉధమ్ పూర్ లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ ను భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకున్న విషయం తెలిసిందే. నవెద్ను విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు పూర్తి వివరాలు సేకరించడానికి సిద్దం అయ్యారు.
నవెద్ ఎవరు, అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడు, అతని కుటుంబ సభ్యులు ఎవరు, వారి ఏం చేస్తున్నారు, నవెద్ చరిత్ర ఏమిటి, అతను ఎక్కడ ఉగ్ర శిక్షణ తీసుకున్నాడు అని పాక్ నుండి అధికారికంగా వివరాలు సేకరించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. నవెద్ వివరాలు పాక్ చెబితే అధికారికంగా ఉంటుందని అంటున్నారు.
నవెద్ తాను పాకిస్థాన్ జాతీయుడినని ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తను పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ లో నివాసం ఉంటున్నానని అధికారులకు చెప్పాడు. అయితే పాక్ మాత్రం నవెద్ మా దేశానికి చెందిన వాడు కాదని, ఆ పేరుతో ఫైసలాబాద్ లో ఎవ్వరు లేరని పాక్ ఇప్పటికే చెప్పింది.
మహమ్మద్ నవెద్ మాత్రం తాను పాక్ జాతీయుడు అని అంగీకరించాడు. నవెద్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ అతను తన కోడుకే అని అంగీకరించాడు. అయితే పాక్ అధికారులు మాత్రం పాత పాటే పాడుతున్నారు.
26/11 ముంబై దాడుల సమయంలో ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్ తమ దేశానికి చెందిన వాడు కాదని పాక్ పదేపదే పాట పాడింది. భారత్ అధికారులు కసబ్ పూర్తి వివరాలు బయటపెట్టడంతో కసబ్ తమ దేశానికి చెందిన వాడని తరువాత పాక్ అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు నవెద్ విషయంలో పాక్ అదే పని చేస్తుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రధాయ పద్దతిలో పాక్ నుండి వివరాలు అడిగామని, మా పని మేము చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.