కరోనా అంతు తేల్చేలా: భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్: యాంటీ థెరపీ సహా
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని చుట్టబెట్టేసిన కరోనా వైరస్ అంతు తేల్చడానికి భారత్-అమెరికాలకు చెందిన శాస్త్రవేత్తలు బరిలోకి దిగబోతున్నారు. ఈ రెండు దేశాల సైంటిస్టులతో కూడిన 11 బృందాలు ఈ దిశగా తమ పరిశోధనలను చేపట్టనున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించబోతోంది. ఈ జాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందనే విషయంపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ మేరకు శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాపై అవుట్ ఆఫ్ ద బాక్స్ పరిశోధనలు సాగిస్తాయని పేర్కొంది.
కరోనా వైరస్ తీవ్ర ప్రభావానికి లోనైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా అగ్ర స్థానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో నిల్చున్నాయి. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే అమెరికా, బ్రెజిల్, భారత్లల్లో ప్రాణనష్టం భారీగా ఉంటోంది. అమెరికాలో ఇప్పటికే లక్షా 80 వేల మందికి పైగా మరణించారు. బ్రెజిల్లో ఈ సంఖ్య లక్షా 20 వేలను దాటింది. భారత్లో 66 వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత భారత్లో విధించిన లాక్డౌన్.. ఆ తరువాతి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపాయి.
ఈ పరిస్థితుల మధ్య కరోనా వైరస్ పుట్టుక మొదలుకుని.. అది విస్తరించిన తీరు, దాన్ని మట్టుబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, యాంటీ వైరల్ థెరపీ వంటి అంశాలపై భారత్-అమెరికా శాస్త్రవేత్తలతో కూడిన 11 బృందాలు పరిశోధనలు సాగించనున్నాయి. కరోనా తీవ్రతను ముందే పసిగట్టడం, మరణాల సంఖ్యను తగ్గించడం, వెంటిలేటర్ రీసెర్చ్, డిస్ఇన్పెక్షన్ పరికరాలు, సెన్సార్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ఈ శాస్త్రవేత్తలతో కూడిన బృందాలు దృష్టి సారిస్తాయి.
Recommended Video
కరోనా వైరస్ను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు ఒకవంక సాగుతున్నాయని, దీనికి సమాంతరంగా.. కరోనా వైరస్పై లోతైన అధ్యయనం చేయడానికి ఈ బృందాలను నియమించాలని నిర్ణయించుకున్నట్లు శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూఎస్-ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోవ్మెంట్ ఫండ్ (యూఎస్ఐఎస్టీఈఎఫ్) కింద ఈ పరిశధనలు సాగుతాయని పేర్కొంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నపేషెంట్ ఆరోగ్య పరిస్థితులు మున్ముందు ఎలా ఉండబోతాయనే అంశంపైనా పరిశోధనలు నిర్వహిస్తారని స్పష్టం చేసింది.