భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం
జమ్మూ: జమ్మ కాశ్మీర్ ప్రాంతంలోని అత్యంత సున్నితమైన ఫల్లన్వాలా సెక్టార్లో భారత్ - పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక సరిహద్దు గస్తీ కేంద్రం సమీపంలో సుమారు 50 మీటర్ల పొడవు కలిగిన ఒక సొరంగ మార్గాన్ని భారత సైనికులు శుక్రవారం కనుగొన్నారు.
కాశ్మీర్లోకి మిలిటెంట్లను చొప్పించడానికి ఈ సొరంగ మార్గాన్ని నిర్మించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం మామూలుగా గస్తీ నిర్వహిస్తున్న భారత జవాన్లకు అధీన రేఖపై చాక్లా పోస్టు వద్ద భారత భూభాగంలో సుమారు 50 మీటర్ల పొడవున్న ఓ సొరంగం కనిపించిందని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు ఉండే ఈ సొరంగ మార్గం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్తోందని ఆ ప్రతినిధి తెలిపారు.
అయితే భారత్ వైపు బైటికి వచ్చే మార్గం లేనందున ఇది అసంపూర్తి సొరంగం కావచ్చన్నారు. మరిన్ని వివరాలు నిర్ధారించుకోవడానికి సైనికులు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారని, అయితే ఇది మందుపాతరలు అమర్చిన ప్రాంతం అయినందున దానికి కొంత సమయం పడుతుందన్నారు.