దుస్తులు విప్పించి: దేవయానికి అవమానం, భారత్ ఫైర్
న్యూఢిల్లీ: వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని కోబ్రాగాదేను అవమానకరరీతిలో అరెస్టు చేసిన న్యూయార్క్ పోలీసులు కస్టడీలో ఆమెతో మరింత దారుణంగా వ్యవహరించారట. ఆమె దుస్తులు విప్పించి, తనిఖీ చేశారట. నేరగాళ్లు, మత్తుమందుకు బానిసలైనవారు, సెక్స్ వర్కర్ల పక్కన నిలబెట్టి ఆమెను విచారించారట.
దేవయానిని న్యూయార్క్ పోలీసులు డిసెంబర్ 12వ తేదిన ఉదయం అందరూ చూస్తుండగా బహిరంగంగా చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలోనూ అంతకన్నా ఘోరంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని న్యూయార్క్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దేవయాని అరెస్టు, కస్టడీలో ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా చట్టసభ ప్రతినిధుల బృందంతో సోమవారం నాటి భేటీని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ రద్దు చేసుకున్నారు. జాతీయ భద్రత సలహాదారు శివ్శంకర్ కూడా ఆ బృందాన్ని కలిసేందుకు నిరాకరించారు.
39 ఏళ్ల దేవయాని ఖోబ్రాగాదె 1999 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారణి. ఈమె పిల్లలను పాఠశాలలో దింపి వస్తుండగా పోలీసులు ఆపి, అందరిముందే అరెస్టు చేశారు. తాను డిప్లోమాట్నని ఆమె అప్పుడే చెప్పారు. అయినప్పటికీ న్యూయార్క్ పోలీసులు తాము ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతూ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె కస్టడీ నుండి విడుదలయ్యారు. ఇది వివాదాస్పదమైంది. కాగా, అమెరికాలో భారత కాన్సులేట్ జనరల్ దేవయానిని అవమానించినందుకు అమెరికా ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు నరేంద్ర మోడీ, సుశీల్ కుమార్ షిండే, రాహుల్ గాంధీలు నిరాకరించారు.
ప్రభుత్వం ఆగ్రహం
దేవయాని పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎస్ దౌత్యవేత్తలను తమ గుర్తింపు కార్డులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాకుండా భారత్ సందర్శిస్తున్న యూఎస్ ప్రతినిధులతో భారత ప్రముఖులు సమావేశాలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమెరికా రాయబార కార్యాలయాలలోని భారతీయ సిబ్బంది జీతభత్యాల వివరాలు తెలపాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరింది.