ఆయుధాలను సిద్దం చేసే పనిలో భారత్..
న్యూఢిల్లీ : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కాస్తంతా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నా.. భారత ప్రభుత్వం మాత్రం అప్రమత్తతో వ్యవహరిస్తోంది. పాక్ దొంగబుద్ది ఎప్పుడు ఎలా బయటపడుతుందో తెలియని నేపథ్యంలో.. ఏ క్షణంలో ఆయుధాలు, మందుగుండు అడిగినా సరే సరఫరా చేసేలా ఉండాలని ఆయుధాల సరఫరాదారులను కోరింది కేంద్రం.
భారత్ పాక్ మధ్య యుద్ద వాతావరణం నేపథ్యంలో.. గత కొద్దిరోజులుగా ఆయుధాల సరఫరాదారుల సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది కేంద్రం. ఈ క్రమంలోనే అవసరమైన ఆయుధాలు సరఫరా చేసేందుకు సరఫరాదారులు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతమున్న ఒప్పందాలకు తోడు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని ఆయుధ ఒప్పందాలు చేసుకోవాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే ఆయుధ తయారీదారులతో కేంద్రం సంప్రదింపులు జరిపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్న పలంగా అడిగితే ఎన్ని ఆయుధాలను సరఫరా చేయగలరు? కాస్త సమయం తీసుకుంటే.. ఆలోగా ఇంకెన్ని ఆయుధాలు అందించగలరు అన్న వివరాలను రక్షణశాఖ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఒకవేళ యుద్దమే గనుక తలెత్తే పరిస్థితి ఉంటే.. అప్పటికప్పుడు ఆయుధాలను సమకూర్చుకోవడం కష్టమయ్యే అవకాశముంది గనుక ఇప్పటినుంచే ఆయుధ సేకరణపై కేంద్రం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications