టిఫిన్ చేసిన తర్వాత టీ ఇవ్వలేదని లక్ష రూపాయల జరిమానా?
భారతీయ రైల్వే కాలానుగుణంగా మారుతోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక సౌకర్యాన్ని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ వారి మన్ననలను అందుకుంటోంది. కరోనా సమయంలో రైల్వేలు ఆలస్యంగా నడవకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు సమయానుకూలంగా రైళ్లు తిరిగే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో ముందుండే రైల్వే ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను తీసుకొస్తోంది. అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విషయం ఉందంటే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడటంలేదు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు మెరుగైన సేవలందిస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు నిఘా కూడా పెడుతున్నారు.
రైలు ప్రయాణికులకు ఆహారం అందించే సంస్థకు ఐఆర్సీటీసీ అధికారులు రూ.లక్ష జరిమానా విధించింది. కాంట్రక్టరు మంచి ఆహారం అందిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్లే జనశతాబ్దిలో అధికారులు ప్రయాణించారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ ఇవ్వడంలేదని గుర్తించారు. రైలు బోగీలు కూడా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ కాంట్రాక్టు సంస్థకు రూ.లక్ష జరిమానా విధించారు. ఏదేమైనా కానీ ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించాలన్న దృక్పథంతో ఉన్న భారతీయ రైల్వే విధానాలపై ప్రయాణికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.