‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’: ఎల్ఎంఓ కొరత తీర్చేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు భారత రైల్వే తనవంతుగా సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రులకు త్వరితగతిన చేరవేసేందుకు 'ఆక్సిజన్ ఎక్స్ప్రెస్' పేరుతో ఓ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ ద్రవ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) కొరతను ఎదుర్కొన్న క్రమంలో.. రైల్వే శాఖ ప్రత్యేక ట్యాంకర్లతో కూడిన రైలు నడపనుంది.

ముంబై సమీపంలోని కాలామ్ బాలి, బోయిసర్ రైల్వే స్టేషన్ నుంచి ఖాళీ ట్యాంకర్లతో కూడిన రైలు విశాఖపట్నం, జంషెడ్ పూర్, రూర్కెలా, బొకారాల నుంచి ఆక్సిజన్ నింపుకుని ఆస్పత్రులకు చేరవేస్తుంది. ఈ విషయమై ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖను సంప్రదించాయి. దీంతో స్పందించిన రైల్వే శాఖ వెంటనే కార్యాచరణ ప్రారంభించింది. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ట్యాంకర్లను ఎక్కించేందుకు దించేందుకు ఎక్కడికక్కడ ర్యాంపులు ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వే లైన్ కు సూచనలు అందాయి. ఇప్పటికే పలు చోట్ల ర్యాంపులు నిర్మాణం చేపట్టారు. రైలు ఆయా ప్రాంతాలకు చేరుకునే సమయానికి వాటిని పూర్తి చేయనున్నారు. రైలు మార్గం ద్వారా వచ్చిన ట్యాంకర్లు రోడ్లపై వెళ్లేటప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎత్తు, వెడల్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక, పలు రైళ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దారు.












Click it and Unblock the Notifications