అత్యాధునిక రైలు- ఈ రూట్ లో పరుగులు: 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం
రైల్వే.. మరో విజయాన్ని సాధించింది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైడ్రోజన్ తో నడిచే ఇంజిన్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రానుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ హైడ్రోజన్ ఆధారిత రైలును విజయవంతంగా పరీక్షించింది.
ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తొలి హైడ్రోజన్ ఆధారిత కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్)ను చెన్నైలోని ఐసీఎఫ్ లో విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. 1,200 హార్స్ పవర్ సామర్థ్యంతో కూడిన హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశామని అన్నారు. ఈ రైలు సాంకేతిక పరిజ్ఞానంలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పర్యావరణానికి హాని కలిగించని విధంగా దేశీయ రవాణా వ్యవస్థ అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే డీజిల్ బోగీలను క్రమంగా దశలవారీగా తొలగిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. దీని స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లను వినియోగంలోకి తీసుకొస్తోంది. దీనికోసం పట్టాల విద్యుదీకరణ శరవేగంగా కొనసాగిస్తోంది.
అదే సమయంలో 15 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలకు కూడా చెల్లుచీటి పలుకుతోంది. దీనికోసం ప్రత్యేకంగా స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పర్యావరణ అనుకూల రవాణా విధానాల్లో భాగంగా ఇప్పుడు తాజాగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను కూడా పట్టాలపై పరుగులు పెట్టే రోజు ఎంతో దూరం లేదు.
హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమంలో భాగంగా 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ హైడ్రోజన్ కోచ్ లకు రూప కల్పన చేసింది. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా వారసత్వ ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాంతాలు, పర్వత మార్గాల్లో నడిపించనుంది.
హైడ్రోజన్ ఆధారిత రైళ్ల నిర్వహణ ఖర్చు గురించి ఇంకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. హైడ్రోజన్ వల్ల పర్యావరణానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Bharat's First Hydrogen Train! 🇮🇳
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2025
Coming soon… pic.twitter.com/Mtq72zd1Dd
- క్లీన్ ఎనర్జీ రవాణాలో భాగంగా 35 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైళ్లను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ 2,800 కోట్ల రూపాయలను కేటాయించింది.
- ఈ రైళ్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ రైలు రూపొందింది.
- 1,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగిన ఇంజిన్ ఇది. 2,600 మంది ప్రయాణికులు ఒకేసారి ఇందులో ప్రయాణించవచ్చు.
- ఒక్కో రైలుకు సుమారు 80 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. పట్టాల కోసం ఒక్కో రూట్ లో అదనంగా 70 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైల్వే ఓ పైలట్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించింది.
- ప్రస్తుతం ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో అనుసంధానిస్తారు.
- నార్తరన్ రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడపడానికి ప్రణాళికలు రూపొందించారు.
- హైడ్రోజన్ రైలు ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. వీటి సరసన భారత్ చేరనుంది.












Click it and Unblock the Notifications