మురుగునీటిలో కరోనా జన్యువులు: భారత శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల అభినందనలు
న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన్నారు భారత శాస్త్రవేత్తలు. దేశంలో కరోనావైరస్ వేస్ట్ వాటర్(మురుగునీరు) ద్వారా సంక్రమిస్తుందా? అనే పరిశోధనలకు ఇది మార్గం సుగమం చేసింది.
ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు పరిశోధనలు చేసింది. మురుగునీరు కారణంగా అహ్మదాబాద్ నగరంలో కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తోందని, ఈ నగరంలోని మురుగునీటిలో కరోనా జన్యువులు ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనాపై వాటర్ బేస్డ్ ఎపిడమాలజీ(డబ్ల్యూబీఈ) పరిశోధనలు చేస్తున్న కొన్ని దేశాలతో భారత్ చేతులు కలిపిందని ఎన్విరాన్ మెంటల్ మైక్రోబయోలాజిస్ట్(యూకే సెంటర్ ఫర్ ఎకోలజీ అండ్ హైడ్రోలాజీ) ఆండ్రూ సింగర ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
భారతదేశంలో ఇప్పటి వరకు 4,27,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,75,315 యాక్టివ్ కేసులున్నాయి. 2,38,192 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
13,720 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 90,81,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 471,316 మంది కరోనాతో మరణించారు. 48,63,113 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 37,46,716 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications