భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు: గత 24 గంటల్లో 56,211 కొత్త కేసులు, 271 మరణాలు
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. నిన్న 70 వేలకు చేరువగా నమోదైన కరోనా కేసులు ఈరోజు దాదాపు 14 వేలకు తగ్గినట్లుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 56,211 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు మంగళవారం ఉదయం వెల్లడించాయి. దీనితో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1, 20,95,855 కు చేరుకుంది.
ఐదున్నర లక్షలకు చేరువగా యాక్టివ్ కేసులు
ఇక ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 18,912 పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం. దీంతో ఇప్పుడు దేశం మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య ఇప్పుడు 5,40,720 కి చేరుకుంది. మరణాల విషయానికొస్తే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 271 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,62,114 కు చేరుకుంది. ఇక కరోనా నుండి కోలుకొని ఇప్పటి వరకు 1,13,93,021 మందిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా దారుణ స్థితిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్ గడ్ ఐదు రాష్ట్రాలు
మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్లతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ -19 కేసులు అధికంగా నమోదవుతున్నాయని, తాజా కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్ గడ్ ఐదు రాష్ట్రాలు దేశంలో మొత్తం చురుకైన కేసులలో 80.17 శాతం ఉన్నాయి. ఇదిలావుండగా, ఢిల్లీ లో గత 24 గంటల్లో 1,900 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది మూడున్నర నెలల్లో అత్యధికం, పాజిటివిటీ రేటు 2.77 శాతానికి పెరిగింది.
మహారాష్ట్రలో తాజాగా 31,643 కొత్త కేసులు, 102 మరణాలు, 6 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
అలాగే, మహారాష్ట్రలో గత 24 గంటల్లో 31,643 కొత్త కోవిడ్ -19 కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్ గడ్ , కర్ణాటక, హర్యానా మరియు రాజస్థాన్ పది రాష్ట్రాలు రోజువారీ కొత్త కేసులను భారీగా నమోదు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న రాష్ట్రాలలో కఠినమైన కరోనా నిబంధనలను అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి నిర్ణయాలతో కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు, భారతదేశంలో మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 6 కోట్లు దాటిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.