నింగిలో అల్లకల్లోలం- ఎయిర్ పోర్టుల్లో దిక్కుతోచని స్థితిలో..
దేశంలో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్లు నేడు కూడా రద్దయ్యాయి. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 550కి పైగా విమానాలను రద్దు చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంతరాయం వేలాది మంది ప్రయాణికులను గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడేలా చేసింది. అక్కడే చిక్కుకుపోయేలా చేసింది. ఇండిగో విమాన ప్రయాణికులు నరకం చవి చూస్తోన్నారు.
సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత, షెడ్యూలింగ్ వైఫల్యాల కారణంగా ఇండిగో కార్యకలాపాలు నాలుగో రోజు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబై- 118, బెంగళూరు- 100, హైదరాబాద్- 75, కోల్కతా- 35, చెన్నై- 26, గోవా-11 విమాన సర్వీసులు రద్దయ్యాయి. భోపాల్ సహా ఇతర నగరాల్లోనూ తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు ప్రయాణికులు, ఇండిగో విమాన సిబ్బంది మధ్య ఘర్షణలకు దారి తీస్తోన్నాయి. గోవా ఎయిర్ పోర్టులో ప్రయాణికులు వారితో గొడవకు దిగారు.

షెడ్యూల్ మార్పులు, సరైన సమాచారం లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు సతమతం అవుతున్నారు. సిబ్బంది నుంచి ఎటువంటి సమాచారం కూడా వారికి అందట్లేదు. ఎప్పుడు పునరుద్ధరణకు నోచుకుంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖులకూ ఈ ఆటంకాలు తప్పలేదు. ముంబై సిటీ ఎఫ్సీ జట్టు, తమ సూపర్ కప్ సెమీఫైనల్ కోసం గోవా వెళ్లేందుకు దాదాపు 10 గంటలు విమానాశ్రయంలోనే గడిపింది. బుధవారం మధ్యాహ్నం బయలుదేరాల్సిన వారి విమానం అర్ధరాత్రి దాటిన తర్వాతే కదిలింది.
ఇండిగో ఫ్లైట్ సిబ్బంది నుంచి తమకు ఎటువంటి సమాచారం అందట్లేదని నవీన్ అనే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశాడు. గువాహటి నుంచి పుణేకు ఇండిగో ఫ్లైట్ లో బయలుదేరానని, ఈ విమానాన్ని గోవాకు మళ్లించారని వాపోయాడు. ఈ దూరానికి 13 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన ఆహారం దొరకట్లేదని, కంటి నిండా కునుకు లేదని పేర్కొన్నాడు. కర్ణాటకకు చెందిన సుమారు 20 మంది ప్రయాణికులు చండీగఢ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
బెంగళూరుకు ఇండిగో విమానాలు అందుబాటులో లేకపోవడంతో.. చిక్కబళ్లాపుర జిల్లాలోని చింతామణి సహా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. వారిలో చాలామంది ఉద్యోగస్తులు. సమయానికి ఆఫీసులకు వెళ్లలేకపోతున్నామని, ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని ఆందోళన చెందుతున్నామని అన్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇండిగో రీషెడ్యూలింగ్ బదులు రీఫండ్లు అందించింది.
బెంగళూరుకు ప్రత్యామ్నాయ విమాన టిక్కెట్లు రూ. 30,000కి పైగా ధర పలికాయి. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు భారంగా పరిణమించింది. ప్రతిరోజూ దాదాపు 2,300 విమానాలను నడిపే ఇండిగో సంస్థ ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ 19.7 శాతానికి పడిపోయింది. కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని రద్దులు ఉండవచ్చని ఎయిర్లైన్ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications