ఫ్లాష్ బ్యాక్: జయం ప్రసంగం వినడం కోసం ఇందిర వచ్చారు
పార్లమెంట్ ఉభయ సభలు జయలలితకు సంతాపం ప్రకటించిన నేపథ్యంలో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జయ రాజకీయ రంగప్రవేశం చేసిన తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశమంతటా తమిళనాట అమ్మ అస్తమయం గురించే చర్చ. జయ జీవిత ప్రస్థానంలోని కీలక మలుపులు.. ఆమె రాజకీయ జీవితంలోని ఒడిదుడుకులను గురించి ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. జయ జీవితంలో కీలకంగా మిగిలిపోయిన పలు ఆసక్తికర ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.
పార్లమెంట్ ఉభయ సభలు జయలలితకు సంతాపం ప్రకటించిన నేపథ్యంలో.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జయ రాజకీయ రంగప్రవేశం చేసిన తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. జయలలిత ప్రసంగం వినడం కోసం ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ సైతం రాజ్యసభకు వచ్చారని కురియన్ వెల్లడించారు.
రాజ్యసభలో జయలలిత ప్రసంగించడం అదే తొలిసారని, ఆ సమయంలో తాను లోక్ సభ సభ్యుడిగా ఉన్నానని కురియన్ పేర్కొన్నారు.జయలలిత ప్రసంగించినప్పుడు గ్యాలరీ అంతా నిండిపోయిందని చెప్పుకొచ్చిన కురియన్.. ఆమె ప్రసంగం అందరిని ఆకట్టుకుందని తెలిపారు.
జయలలిత ప్రసంగం ఆరోజుకు హైలైట్ గా నిలిచిందని, సినీ పరిశ్రమ నుంచి వ్యక్తి ఇంత అద్భుతంగా మాట్లాడగలదా? అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారని కురియన్ అన్నారు. ప్రజా జీవితంలో జయ ప్రస్థానం చిరస్మరణీయమైనదిగా, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషిని కురియన్ కొనియాడారు.