బాలి టూ భారత్: మాఫియా డాన్ ఛోటా రాజన్
బాలి: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ తీసుకువస్తున్నారు. ఇండోనేషియాలోని బాలి పోలీసుల అదుపులో ఉన్న ఛోటా రాజన్ ను భారత్ సీబీఐ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఛోటా రాజన్ తో బాలి విమానాశ్రయం చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై నగరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపారు. మొదట ఛోటా రాజన్ ను ఢిల్లీకి తీసుకుస్తున్నారు. అక్కడ సీబీఐ సీనియర్ అధికారులు ఛోటా రాజన్ ను విచారించనున్నారు.
దావూద్ ఇబ్రహీం సమాచారం, అండర్ వరల్డ్ మాఫియా కార్యకలాపాలు గురించి పూర్తి వివరాలు సేకరించనున్నారు. తరువాత ఛోటా రాజన్ ను ముంబై పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఛోటా రాజన్ ను భారత్ కు ఎప్పుడు తీసుకు వస్తారు అని విలేకరులు న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ప్రశ్నించారు. త్వరలోనే అతడు భారత్ లో ఉంటాడని రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. గురువారం రాత్రి లోపు ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.