Pallonji Mistry: దిగ్గజ పారిశ్రామికవేత్త కన్నుమూత: తెలంగాణ సచివాలయం, ఆర్బీఐ భవనాల నిర్మాత
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఆయనకు భార్య పట్సీ పెరిన్ దుబాష్, ఇద్దరు కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ, కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. పారిశ్రామికరంగంలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
1929లో భారత్లో స్థిరపడిన పార్శీ కుటుంబంలో జన్మించారాయన. 2003లో ఐర్లాండ్ పౌరసత్వాన్ని పొందారు. పారిశ్రామికరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. పల్లోంజీ కుమారుల్లో ఒకరైన సైరస్ మిస్త్రీ 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఛైర్మన్గా పని చేసిన విషయం తెలిసిందే. కుమార్తెల్లో ఒకరైన ఆలూ మిస్త్రీ..రతన్ టాటా సమీప బంధువు నోయెల్ టాటాను వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం నోయెల్ టాటా.. ట్రెంట్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్కు ఛైర్మన్గా పని చేస్తోన్నారు. టైటాన్ కంపెనీ, టాటా స్టీల్స్కు వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తోన్నారు. కాగా పల్లోంజీ మిస్త్రీ.. ముంబైలోని క్యాథడ్రాల్ అండ్ జాన్ క్యానన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. తండ్రి నెలకొల్పిన వ్యాపార కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. క్రమంగా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలను విదేశాలకు విస్తరింపజేశారు.
భారత్తో పాటు అబుధాబి, దుబాయ్, ఖతర్, ఆఫ్రికా, మధ్య తూర్పు ఆసియా, దక్షిణాసియాలో ప్రధాన పారిశ్రామిక శక్తిగా ఎదిగిందీ కంపెనీ. ముంబైలోని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలను నిర్మించింది ఈ కంపెనీయే. మలబార్ రిజర్వాయర్, సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియాన్నీ నిర్మించింది. టాటా సన్స్లో పల్లోంజీ మిస్త్రీకి 18.37 శాతం వాటాలు ఉన్నాయి. 1930లోనే టాటా సన్స్లో వాటాలను కొనుగోలు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చరర్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.