స్వచ్ఛమైన గాలి మా హక్కు: సుప్రీంకు శిశువులు
న్యూఢిల్లీ: స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును తమకు కల్పించమంటూ ముగ్గురు శిశువులు తొలిసారిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ హక్కు తమకుందని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఆరు నెలల పసివాళ్లు అర్జున గోపాల్, ఆరవ్ భండారి, మరో 14 నెలల జోయా రావ్ అనే వారి పేర్ల మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశాన్ని తమకు కల్పించాలని వారు కోరారు.
'మా ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా వికసించలేదు. క్రాకర్స్(టపాసులు) పేల్చడం ద్వారా కలుషితమైన గాలిని మేం పీల్చలేం.. మమ్మల్ని కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాబోయే దసరా, దీపావళి సందర్భంగా పేల్చబోయే, కాల్చబోయే మందుగుండు సామగ్రి వల్ల ఢిల్లీలోని గాలి మరింత కలుషితం కానుంది' అని పిటిషన్లో పేర్కొన్నారు.దీనిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే రాజ్యాంగం ప్రకారం మైనార్టీ తీరని పిల్లలు తమ హక్కుల కోసం తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా కోర్టులను ఆశ్రయించవచ్చు. న్యాయవాదులైన తమ తండ్రుల ద్వారా ముగ్గురు శిశువులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.