కేరళలో శ్రీలంక తరహా దాడులకు ప్లాన్! కుట్ర భగ్నం చేసిన ఎన్ఐఏ!
శ్రీలంకలో దారుణ మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భారత్లోనూ అలాంటి దాడులకు పాల్పడేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక ఉగ్రదాడి మాస్టర్ మైండ్గా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కాల్ డేటా పరిశీలించిన అధికారులు వాటిలో పదుల సంఖ్యలో తమిళనాడు, కేరళకు చెందిన వ్యక్తుల నెంబర్లను గుర్తించారు.
బురఖా బ్యాన్ ! వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం
భారత్లో 3నెలలు తలదాచుకున్న హషీమ్
శ్రీలంక దాడుల సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ గతేడాది భారత్కు వచ్చినట్లు నిఘా అధికారులు గుర్తించారు. దాదాపు మూడు నెలల పాటు అతడు పలు ప్రాంతాల్లో సంచరించనట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో అతను తన ప్లాన్ అమలు చేసేందుకు శ్రీలంక వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కేరళలో శ్రీలంక తరహా దాడికి యత్నం
శ్రీలంకలో జరిపిన మారణహోమం తరహాలోనే కేరళలోనూ ఆత్మాహుతి దాడులు జరపడానికి ఉగ్రవాదులు ప్లాన్ వేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తెలిపింది. జహ్రాన్ హషీమ్ అనుచరుడు రియాజ్ అబూబకర్ అలియాస్ అబూ దిజానా అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులకు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. పలక్కడ్కు చెందిన రియాజ్ ఏడాదికాలంగా హషీమ్ ప్రసంగాలు, జకీర్ నాయక్ బోధనలు వింటున్నట్లు చెప్పాడు. రాష్ట్రంలో ఏదైనా చర్చిలో వీలైతే పలక్కడ్లోనే ఆత్మాహుతి దాడి జరిపేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులకు వివరించాడు.
ఉగ్రవాదుల టచ్లో రియాజ్
అజ్ఞాతంలో ఉన్న ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ అబ్దుల్లా, సిరియాలో ఐఎస్ శిక్షణలో ఉన్న వలపట్టణాకు చెందిన అబ్దుల్ ఖయ్యూం అలియాస్ అబూ ఖాలిద్తో చాలా కాలంగా ఆన్లైన్లో మాట్లాడుతున్నట్లు రియాజ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. వారిద్దరి సలహా మేరకు నలుగురు వ్యక్తులు నరమేధానికి కుట్ర పన్నినట్లు అంగీకరించాడు. బుధవారం ఎన్ఐఏ కొచ్చిన్ కోర్టులో రియాజ్ ను హాజరుపరచనుంది.