ఆ కామాంధులను ఉరి తీసే అవకాశం ఇవ్వండి: రక్తంతో లేఖ రాసిన క్రీడాకారిణి.. !
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురు కామాంధులను ఉరి తీయడానికి ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో.. ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని ఓ క్రీడాకారిణి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.. రక్తంతో. ఆమె పేరు వర్తికా సింగ్. అంతర్జాతీయ షూటర్. షూటింగ్ విభాగంలో మనదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంట్ లకు ప్రాతినిథ్యం వహించారు.
నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారిని మహిళల ద్వారా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆమె రక్తంతో లేఖ రాశారు. ఓ మహిళ వల్ల ఆ కిరాతకులను ఉరి తీయడం వల్ల సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని అన్నారు. మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై అత్యంత పాశవికంగా అత్యాచానికి పాల్పడాలనుకునే వారి వెన్నులో భయం పడుతుందని, అలాంటి నీచ పనులకు వారు దిగబోరని అభిప్రాయ పడ్డారు.
దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు, వేర్వేరు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, సెలబ్రిటీలు తన నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు. అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు ఓ మహిళ కూడా మరణ శిక్షను అమలు చేయగలదనే ఉద్దేశాన్ని చాటి చెప్పినట్టవుతుందని అన్నారు. మహిళలను శక్తిహీనులుగా భావించడం వల్లే వారిపై యథేచ్ఛగా, ఇష్టానుసారంగా అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నాయని, వాటిని నిరోధించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని వర్తికాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
నిజానికి- నిర్భయ దోషులను ఈ నెల 16వ తేదీన ఉరి తీసే అవకాశాలు ఉన్నాయంటూ అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనికోసం తీహార్ జైలు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని, ఇద్దరు తలారులను ఢిల్లీకి పంపించాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు అధికారులకు ఆదేశాలను కూడా జారీ అయ్యాయి. నిర్భయ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
వారిలో అక్షయ్ కుమార్ సింగ్.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయడం, దానిపై 17వ తేదీన విచారణ నిర్వహించబోతుండటం.. ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డెతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్ ను విచారించనుంది. రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువడిస్తుందనే అంశం చర్చనీయాంశమైంది.