జూన్ నాటికి 50 కోట్ల మందికి చేరువ: ఇంటర్నెట్లో యూత్ ఎక్కువగా చూసేది ఈ రెండే!
న్యూఢిల్లీ: గత ఏడాది (2017) డిసెంబర్లో 481 మిలియన్ల మంది ఇంటర్నెట్ను వినియోగించినట్లుగా అంచనా వేశారు. 2016 డిసెంబర్తో పోల్చుకుంటే ఈ వృద్ధి 11.34 శాతం ఉంది. ఇంటర్నెట్ యూజర్స్ 2018 జూన్ నాటికి 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటుందని 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా 2017' ప్రకారం అంచనా. ఈ మేరకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా & కంటార్ ఐఎంఆర్బీ సంయుక్తంగా పబ్లిష్ చేసింది.
రిపోర్ట్ ప్రకారం భారత దేశంలోని పట్టణాల్లో డిసెంబర్ 2016తో పోల్చుకుంటే డిసెంబర్ 2017లో 9.66 శాతం పెరిగింది. అర్బన్ ఇండియాలో 295 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. గ్రామీణ భారతంలో 2016 డిసెంబర్తో పోల్చుకుంటే 2017 డిసెంబర్లో 14.11 శాతం పెరిగింది. గ్రామాల్లో ఉపయోగించే వారి సంఖ్య 186 మిలియన్లుగా ఉంది.
గ్రామీణ-పట్టణ భారతం
గత ఏడాదిలో గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ను వినియోగించే వారి శాతంలో పెరుగుదల ఎక్కువగా ఉంది. మొత్తంగా మాత్రం గ్రామీణ భారతంలో వినియోగం తక్కువగా ఉంది. 2017 డిసెంబర్లో పట్టణ భారతంలో ఇంటర్నెట్ వినియోగం 64.84 శాతంగా ఉంది. 2016 డిసెంబర్లో ఇది 60.6 శాతంగా ఉంది. గ్రామీణ భారతంలో 2016 డిసెంబర్లో 18 శాతం ఉండగా 2017 డిసెంబర్లో 20.26గా ఉంది.
పట్టణంలో కంటే గ్రామాల్లో తక్కువ
పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా చాలా ఎక్కువ. కాబట్టి భవిష్యత్తు అభివృద్ధి పాలసీలను గ్రామీణ, పట్టణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. 2011 లెక్కల ప్రకారం పట్టణాల్లో 455 మిలియన్ జనాభా ఉండగా అందులో 295 మిలియన్లు ఇంటర్నెట్ వాడకందారులు. గ్రామాల్లో మాత్రం ఇంటర్నెట్ వినియోగ దారులు 186 మిలియన్లు మాత్రమే. గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉంది.
ప్రతి రోజు ఇంటర్నెట్ వాడేవారిలో
ప్రతి రోజు ఇంటర్నెట్ ఉపయోగించే 281 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులలో 182.9 మిలియన్ లేదా 62 శాతం మంది పట్టణం నుంచి ఉండగా గ్రామీణ భారతంలో 98 మిలియన్ మంది ఉపయోగిస్తున్నారు.
మహిళల కంటే పురుషుల ఎక్కువ
దేశంలో ఇప్పటికీ ఇంటర్నెట్ వినియోగదారులలో పురుషులే ఎక్కువ. వినియోగదారుల్లో 143 మిలియన్ మంది మహిళలు. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఇది 30 శాతం. డిజిటల్ ఇండియా గ్రామీణ భారతంలోకి నెట్ చొచ్చకు పోతోంది. కానీ లింగ అంతరం మాత్రం కొనసాగుతోంది.
సమానత్వం ఆహ్వానించదగ్గ పరిణామం
గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వినియోగంలో పురుషులు, మహిళల రేషియా 64:36గా ఉంది. గత ఏడాదిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వినియోగంలో లింగ బేధం తగ్గుతూ వస్తోంది. మహిళలు వాడటం పెరుగుతోంది. క్రమంగా లింగ సమానత్వం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం.
యువత, విద్యార్థులే ఎక్కువ
రిపోర్ట్ ప్రకారం ఇంటర్నెట్ వినియోగదారుల్లో విద్యార్థులు, యువత అరవై శాతం. సోషల్ మీడియా, ఎంటర్టైన్ మెంట్ వాడకం ఎక్కువగా ఉంది. కాలేజీ, స్కూల్ విద్యార్థులు 33 శాతం, వర్కింగ్ వుమెన్ 9 శాతం, నాన్ వర్కింగ్ వుమెన్ 15 శాతం, యువత 26 శాతం, వృద్ధులు 14 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.