Expert View:బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయి..?
మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ కంటే ముందు ఎలాంటి స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయనేది ఆర్థిక రంగ నిపుణులు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మంచి లాభాలు రావాలంటే ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి..?
కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో స్టాక్స్ పై మంచి రిటర్న్స్ రావాలంటే పలు టిప్స్ అందిస్తున్నారు మార్కెట్ నిపుణులు మరియు ఆర్థిక రంగ నిపుణులు. ప్రధానంగా రెండు సంస్థలకు చెందిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు గడించొచ్చని వారు జోస్యం చెబుతున్నారు. ఇవి రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్. బడ్జెట్ 2021 కంటే ముందు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫర్టిలైజర్స్ సంస్థలో స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచి లాభాలను ఆశించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గ్రామీణ భారతంలో రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్కు మంచి ఆదరణ ఉంది. ఇక ఈ బడ్జెట్లో సబ్సీడీ సంస్థ అయిన ఆర్ఎఫ్సీకి బకాయిలు చెల్లించే ప్రకటన రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని అదే సమయంలో ఆర్థికంగా కూడా భారత్ పుంజుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో రైతుల ఆదాయంను రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం, నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయడం వంటి సానుకూల అంశాలు ఆర్ఎఫ్సీకి మేలు చేకూరుస్తాయని అందుకే ఈ స్టాక్స్ పుంజుకుని లాభాలు తీసుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక స్వల్పకాలిక లక్ష్యాలకు ఆర్ఎఫ్సీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని, స్టాక్ వాల్యూ కూడా తక్కువగా రూ.65గా ఉందని చెప్పారు. ఇక స్టాప్ లాస్ వాల్యూ రూ 52గా అంచనా వేస్తున్నారు. గురువారం రోజున ఆర్ఎఫ్సీ స్టార్ రూ.55 వద్ద ట్రేడ్ అయిందని చెబుతున్నారు.
ఇక ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలంటే మరో స్టాక్ను కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఉక్కు రంగం నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ త్రైమాసికంలో ఉక్కు రంగంలో చాలా మటుకు సంస్థలు లాభాల దిశగా పయనించాయని గుర్తుచేశారు. గురువారం రోజు కాస్త నెగిటివ్ మూవ్మెంట్ను జేఎస్డబ్ల్యూ కనబర్చినందున ఈ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక షార్ట్టర్మ్ టార్గెట్ రూ.420 ఉంటుండగా... స్టాప్లాస్ రూ.390 ఉంటుందని అంచనా వేస్తున్నారు.