ఇండియాలో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల మైండ్ సెట్ మారిందన్న ప్రధాని మోడీ: భారత్ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారత దేశ భవిష్యత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు . అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవాల ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన మోడీ అంతర్జాతీయంగా భారతదేశం భవిష్యత్తులో నిర్వహించబోయే పాత్ర చాలా కీలకమైనదని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు భారతదేశం ఎందుకు ? అన్న ప్రశ్న ఉదయిస్తే , ఇప్పుడు భారతదేశం ఎందుకు కాదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు ఉత్పన్నమవుతుంది అంటూ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల మైండ్సెట్ 'వై ఇండియా' నుంచి 'వై నాట్ ఇండియా' గా మారిపోయిందన్నారు మోడీ.
వచ్చే 27 సంవత్సరాలు భారత దేశానికి అత్యంత కీలకమన్న ప్రధాని
వచ్చే 27 సంవత్సరాలు భారత దేశానికి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు . దేశంలోని ఆర్థిక సంస్కరణలు చూసి ఇతర దేశాలు భారతదేశం పై ఆసక్తిని చూపిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్థిక సంస్కరణలలో ది బెస్ట్ గా దేశాన్ని ముందుకు నడిపించామని, ఆ సమయంలో కూడా రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను సాధించగలమని పేర్కొన్నారు. 6 నెలల క్రితం తమ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ప్రారంభించాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం
గతంలో భారత దేశంలో పెట్టుబడి పెట్టడం ఎందుకు అని ప్రశ్నించిన పెట్టుబడిదారులు, గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారని మోడీ అన్నారు .1500 పాత, వాడుకలో లేని చట్టాలను రద్దు చేశామన్నారు. మారుతున్న పెట్టుబడి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. గతంలో పెట్టుబడులు పెట్టే వారికి రెడ్ టేప్ ఉండేదని , కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వారికి రెడ్ కార్పెట్ ను పరుస్తున్నాము అని మోడీ చెప్పారు. స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ వైపు దూసుకుపోతున్న ఇండియా
ఇంతకు ముందు పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ జోక్యం చాలా ఉండేది. పెట్టుబడిదారులు భారతదేశ ఎందుకు వచ్చామా అని ఇబ్బంది పడే వారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటు రంగం పై ప్రభుత్వం చూపిన ప్రోత్సాహం భారతదేశానికి వచ్చేలా చేశాయని, కొత్త భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ వైపు దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశీయ సామర్థ్యాలు , తయారీ మరియు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన అన్నారు. భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు.
ప్రపంచం భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తుంది
ప్రపంచం భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తుందన్నారు . రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డి) లో పెట్టుబడులు పెంచాలని, ప్రైవేటు రంగం పెట్టుబడులను పెంచాలని ఆయన అన్నారు. ఆర్అండ్డిలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. యుఎస్లో ఆర్అండ్డిలో 70 శాతం పెట్టుబడులు ప్రైవేటు రంగం పెట్టిందని చెప్పారు .ఈ రోజు ఆర్అండ్డిలో పెట్టుబడుల ప్రైవేటు రంగ వాటాను పెంచాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ప్రపంచ సరఫరా గొలుసులో డిమాండ్ ఏదైనా సరే భారత్ తీర్చేలాగా అభివృద్ధి సాధించాలని మోడీ పేర్కొన్నారు.