IRCTC నవరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరలో..
IRCTC భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులు నాలుగు ప్రధాన జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు . అలాగే ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా పేరు గాంచిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ నవరాత్రి టూర్ ప్యాకేజీ అక్టోబర్ 25 నుంచి ప్రారంభం అవుతుంది.
నవరాత్రి టూర్ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడపాలని IRCTC సంస్థ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ రైలు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రదేశాలకు భక్తులను తీసుకెళ్తుంది. ఈ ప్రయాణం అమృత్సర్ నుండి ప్రారంభం అవుతుంది. అలా జలంధర్ సిటీ, లూధియానా, చండీగఢ్, అంబాలా కంటోన్మెంట్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, సోనిపట్, ఢిల్లీ కంటోన్మెంట్, రేవారి వంటి స్టేషన్ల మీదుగా సాగుతుంది.
ఇక ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులు నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అవి మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాలు. ఈ ప్రయాణం 9 రోజులపాటు సాగుతుంది. ఒక్క రోజుకు దాదాపు రూ. 2,200 ఖర్చు అవుతుంది. ఈ ప్రయాణం ఉజ్జయిని నుండి ప్రారంభం అవుతుంది.

జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత రైలు గుజరాత్ లోని కెవాడియాకు చేరుకుంటుంది. అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూడొచ్చు. అక్కడి నుంచి ప్రయాణం ద్వారకకు వెళ్తుంది. అక్కడ ద్వారకాధీశ ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు. ఇక చివరగా రైలు సోమనాథ్ వెళ్తుంది. ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం ద్వారా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగుస్తుంది. ఆసక్తి కలిగిన భక్తులు IRCTC టూరిజం వెబ్సైట్ https://www.irctctourism.com ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ రేట్ల వివరాల పూర్తి సమాచారం వెబ్ సైట్ లో ఉంది.












Click it and Unblock the Notifications