17వ తేదీ గండం: ఏడాదిలో కన్నుమూసిన ఆ ముగ్గురు కన్నడ స్టార్ హీరోల పుట్టిన తేదీ ఒక్కటే
బెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్కుమార్ అకాల మరణం ఎందరినో కలిచి వేస్తోంది. ఆయన ఇక లేడనే విషయాన్ని కోట్లాదిమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి వీడ్కోలు పలకడానికి బెంగళూరుకు తరలి వస్తోన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం జనసంద్రంగా మారింది. అర్ధరాత్రయినా.. వర్షం పడినా లెక్క చేయట్లేదు. తాము ఆరాధించే హీరోను చివరిసారిగా చూడటానికి పోటెత్తుతున్నారు.

హఠాన్మరణంతో శోకసంద్రంలో..
పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను చేపడతారు. ఆయన తండ్రి రాజ్కుమార్, తల్లి పార్వతమ్మల సమాధులు అక్కడే ఉన్నాయి. పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణానికి రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

చిత్రపరిశ్రమ బంద్..
ఆయన మరణానికి సంతాప సూచకంగా కన్నడ చలన చిత్ర పరిశ్రమ.. సినిమాల షూటింగ్ను నిలిపివేసింది. ఎగ్జిబిటర్లు రాష్ట్రం మొత్తం సినిమా థియేటర్లను మూసివేశారు. అంత్యక్రియలు ముగిసేంత వరకు థియేటర్లను మూసి ఉంచాలని వారు నిర్ణయించిన విషయం తెలిసిందే. పలు చోట్ల పునీత్ ఫొటోలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంగా ఇవే దృశ్యాలు కనిపించాయి. తమ ఆరాధ్యనటుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏడాదిలో ముగ్గురు హీరోలు..
పునీత్ హఠాన్మరణంతో వరుసగా ఏడాది కాలంలో ముగ్గురు స్టార్ హీరోలను కన్నడ చలన చిత్ర పరిశ్రమ కోల్పోయినట్టయింది. గత ఏడాది చిరంజీవి సర్జా.. ఇదే తరహాలో గుండెపోటుకు గురయ్యారు. బన్నేరుఘట్టలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యాక్షన్ కింగ్ అర్జున్కు స్వయానా మేనల్లుడు చిరంజీవి సర్జా. ప్రముఖ నటి మేఘనా రాజ్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం సంచారి విజయ్, పునీత్ రాజ్కుమార్ తిరిగిరాని లోకానికి వెళ్లారు.

ఈ ముగ్గురి పుట్టిన తేదీ ఒక్కటే..
యాదృచ్ఛికమో.. మరేమిటో తెలియట్లేదు గానీ- ఈ ముగ్గురు స్టార్ హీరోల పుట్టిన తేదీ ఒక్కటే. చిరంజీవి సర్జా, సంచారి విజయ్, పునీత్ రాజ్కుమార్.. ఈ ముగ్గురు కూడా 17వ తేదీ నాడే జన్మించారు. దీనితో జ్యోతిష్య శాస్త్రంపై అందరి దృష్టి నిలిచింది. ఏడాదికాలంలో ముగ్గురు అకాల మరణానికి గల కారణానికి, ఈ తేదీకి సంబంధం ఏమిటంటూ ఆరా తీస్తోన్నారు. ఎవరికి తోచినట్టు వారు తమ అంచనాలను వ్యక్తం చేస్తోన్నారు. అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

1984 అక్టోబర్ 17వ తేదీన..
చిరంజీవి సర్జా 1984 అక్టోబర్ 17వ తేదీన జన్మించారు. గత ఏడాది జూన్ 7వ తేదీన ఆయన కన్నుమూశారు. పునీత్ తరహాలోనే గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనను బతికించుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించలేదు. చిన్న వయస్సులోనే చిరంజీవి సర్జా అభిమానులు, కుటుంబ సభ్యులకు దూరం అయ్యారు. చిరంజీవి సర్జా మరణించే నాటికి ఆయన భార్య, నటి మేఘనా రాజ్ గర్భిణి.

1983 జులై 17వ తేదీన..
మరో హీరో సంచారి విజయ్.. 1983 జులై 17వ తేదీన జన్మించారు. ఈ ఏడాది జూన్ 15వ తేదీన ఆయన కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంచారి విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ సందర్భంగా నిరాశ్రయులైన వారికి ఆహారం, దుప్పటిని అందించడానికి తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారాయన.

1975 మార్చి 17వ తేదీన..
ఇక పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ 1975 మార్చి17వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఒకప్పటి సూపర్ స్టార్ రాజ్కుమార్-పార్వతమ్మ. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ముగ్గురి పుట్టిన తేదీ ఒక్కటే కావడం.. ముగ్గురూ ఒకే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం.. స్టార్ డమ్ సంపాదించుకోవడం.. ఏడాది వ్యవధిలో కన్నుమూయడం- జ్యోతిష్కులకు చేతినిండా పని పెట్టినట్టయింది.












Click it and Unblock the Notifications