బీజేపీ టార్గెట్ చంద్రబాబు?: మూల్యం చెల్లించుకోక తప్పదా!..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలు అక్కడి పార్టీల మధ్య ఎంతటి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అంతే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కర్ణాటక ఎన్నికలపై ఫోకస్ చేయడమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా మోడీకి చంద్రబాబుకు పూర్తిగా చెడిన నేపథ్యంలో.. బాబుపై మున్ముందు కక్ష సాధింపు చర్యలు ఉంటాయా? అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. బీజేపీ ఓటమికి ఓ ప్రత్యేక బృందాన్ని సైతం పంపించి తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయించిన చంద్రబాబును బీజేపీ ఎంతమాత్రం లైట్ తీసుకోదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి.

నిజంగానే అనూహ్య పరిణామాలు ఉంటాయా?:
మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ ఇటీవలే బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. త్వరలోనే చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని చేపట్టినా.. చేపట్టకపోయినా.. తమకు వ్యతిరేకంగా పనిచేసినందుకు బాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న భావనలో ఆ పార్టీ ఉన్నది.

బాబులో భయం మొదలైందా!:
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే తనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ప్రజలంతా తనకు అండగా ఉండాలని బహిరంగ సభల్లోనే కోరుతున్నారు. అందుకే బీజేపీని నిలువరించి కాంగ్రెస్, జేడీఎస్ అధికారంలోకి రావాలనే ఆయన కోరుకుంటున్నారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్ చేసి.. కాంగ్రెస్ తోనే వెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అంటే, బీజేపీ ఇక తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు అన్న భయం పట్టుకుంది కాబట్టే చంద్రబాబు ఇంతలా జాగ్రత్తపడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంత ఉలికిపాటు:
చంద్రబాబును ఇప్పటికైతే బీజేపీ ప్రత్యక్షంగా టార్గెట్ చేసింది లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడే అంత ఉలికిపాటు ఎందుకు అని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబుకు కలలోనూ బీజేపీయే కనిపిస్తోందని వారు ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తన చుట్టూ ఉచ్చు బిగించేయడం ఖాయమని చంద్రబాబు గ్రహించారని ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అది మాత్రం పెద్ద షాకే..:
ఇదంతా పక్కనపెడితే.. కర్ణాటకలోని తెలుగు ప్రజలు చంద్రబాబు మాటలను పట్టించుకోవడం నిజంగా ఆయనకు షాక్ అనే చెప్పాలి. కర్ణాటకలో ఉన్న దాదాపు 70లక్షల మంది తెలుగు ఓటర్లలో అత్యధికులు బీజేపీకే ఓటేసినట్టు చెబుతున్నారు. అంటే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న సెంటిమెంటు వారిపై ఏమాత్రం పనిచేయలేదని అర్థమవుతోంది. ఏదేమైనా కర్ణాటక ఎన్నికల తర్వాతి పరిణామాలు ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications