కన్నయ్య అబద్ధం చెప్పాడా!: విమానంలో ఏం జరిగింది?
ముంబై/న్యూఢిల్లీ: ముంబై నుంచి పుణెకు బయలుదేరే జెట్ ఎయిర్వేస్ విమానంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త, టీసీఎస్ ఉద్యోగి ఒకరు తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, వాస్తవానికి విమానంలో గొడవకు దిగింది కన్నయ్య కుమారేనట. సీటు విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవగానే దీన్ని పరిగణించాలి తప్ప, హత్యాయత్నాలు ఏమీ జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు ముంబై షహర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
ఓ ప్రయాణికుడు తనకు కేటాయించిన విండో సీటులో కూర్చునేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డుగా ఉన్న కన్నయ్యను తగలడంతో వివాదం జరిగిందని తెలిపారు. ఇద్దరు తోసుకున్నారే తప్ప.. మరేమీ జరగలేదని చెప్పారు.
ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అయినప్పటికీ, కన్నయ్య చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగించనున్నామని, మరింత మంది నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తామని వివరించారు.