మోడీ దేవుడా: ఖర్గే ప్రశ్న, నవ్వులు, ప్రధాని భయంతో..
న్యూఢిల్లీ: 'అరుదుగా మాత్రమే దర్శనం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేవుడా?' అని కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే బుధవారం లోకసభలో ప్రశ్నించారు. అప్పుడు లోకసభలో నవ్వులు విరిశాయి. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే మరోవైపు మోడీ సభలో కన్పించడం లేదంటూ విపక్ష ఎంపీలు విమర్శించారు.
ప్రధానిని రోజూ సభకు రావాలని తాము కోరడం లేదని, కనీసం వారానికి ఓసారైనా మోడీ సభలో కన్పిస్తే సంతోషిస్తామని మంగళవారం లోకసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై బుధవారం సుష్మా స్వరాజ్ సభలో వివరణ ఇచ్చారు.

ప్రశ్నోత్తరాల సమయంలో మోడీ సభ్యులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఖర్గే.. ప్రధాని ఏమైనా దేవుడా.. అప్పుడప్పుడూ దర్శనం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు పూయించాయి. అయితే, మోడీ భయంతో బీజేపీ సభ్యుల హాజరు మాత్రం 100 శాతం ఉండటం గమనార్హం. బీజేపీకి చెందిన 280 మంది ఎంపీలు ఠంచన్గా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు సూరజ్కుండ్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని మోడీ స్పష్టం చేశారు. ఎంపీల హాజరు విషయంలోనూ ఆయన గుజరాత్ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన సహచరులు పేర్కొంటున్నారు. 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ హయాంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల హాజరు 100 శాతం ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications