ప్రభుత్వ 'ఫ్యాక్ట్ చెక్ టీమ్' కూడా ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందా? ఇవిగో ఉదాహరణలు...
ఏదైనా ఒక వార్త ఫేక్ న్యూసా, కాదా? భారత ప్రభుత్వ సమాచార సంస్థ 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో -పీఐబీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ విషయాన్ని నిర్ణయిస్తుంటుందని చెప్పవచ్చు.
అంటే, పీఐబీ ఏదైనా వార్తను ఫేక్ లేదా తప్పుడు వార్త అని ప్రకటిస్తే, దాన్ని సోషల్ మీడియా సహా అన్ని ఆన్లైన్ వేదికల నుంచి తొలగిస్తారు.
సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఐటీ నిబంధనలకు సంబంధించి కొత్తగా సవరించిన ముసాయిదా ప్రతిని తన వెబ్సైట్లో షేర్ చేసింది.
ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతానికి ప్రతిపాదనలు మాత్రమే. అయితే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు సహా మేధావి వర్గం వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భావప్రకటన స్వేచ్ఛను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
"మోదీ ప్రభుత్వం ఆన్లైన్లో వచ్చే వార్తల ఫ్యాక్ట్ చెక్ చేస్తే, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఫ్యాక్ట్ చెక్ ఎవరు చేస్తారు? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ప్రశ్నించారు.
వెబ్సైట్లో పెట్టిన ముసాయిదా ప్రతిలో ప్రధానంగా మీడియా, సోషల్ మీడియా, వీడియో గేమ్లకు సంబంధించిన నిబంధనలపై ప్రతిపాదనలు మాత్రమే ఉన్నాయి.
ఆ ప్రతిపాదనలు ఎలాంటివి? అవి ఎంత ప్రమాదకరం? నిజంగా భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటాయా? వంటి విషయాలు పరిశీలిద్దాం.
అలాగే, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ గతంలో ఎలాంటి వార్తలను ఫేక్ న్యూస్గా ప్రకటించింది? లేదా స్వయంగా ఫేక్ న్యూస్ లేదా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడంలో పాలుపంచుకుందా? వంటి విషయాలు కూడా తెలుసుకుందాం.
- బీబీసీ డాక్యుమెంటరీ: ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం చెప్పారు?
- కులాల వారీగా జనాభా లెక్కలు తీయడానికి అభ్యంతరం ఎందుకు... దీనివల్ల బీజేపీకి నష్టమా?
https://twitter.com/IndEditorsGuild/status/1615711018986110976
ప్రతిపాదనలలో ఏముంది?
ఐటీ నిబంధనల ప్రతిపాదనలలో ముఖ్యాంశాలు ఇవి:
- పీఐబీ ఏదైనా వార్తను ఫేక్ అని నిర్థరిస్తే దాన్ని తొలగించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ సంస్థలు ఏదైనా వార్తను తప్పుదారి పట్టించే వార్తగా పేర్కొంటే ఆ కంటెంట్ను ఆన్లైన్ ప్లాట్ఫారమ్ నుంచి తొలగించాల్సి ఉంటుంది.
- పీఐబీ ఫేక్ న్యూస్ అని తేల్చిన కంటెంట్ లింక్ను ఇంటర్నెట్ ప్రొవైడర్లు కూడా తొలగించాలి.
- అలాంటి వార్తలు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వేదికలలో కూడా కనిపించకూడదు.
- పీఐబీకి ఇస్తున్న అధికారాలు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69(ఏ) కిందకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- దేన్ని ఫేక్ న్యూస్గా పరిగణిస్తారు, దేన్ని పరిగణించరు అనే అంశాలు స్పష్టంగా లేవు.
ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీఐబీ ఎప్పుడు ఎలా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసింది?
2019లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం ఏర్పాటైంది. ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పథకాలకు సంబంధించిన వార్తలను పరిశోధించడం, సరైన సమాచారాన్ని అందించడం దీని లక్ష్యం.
ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలను నకిలీ లేదా తప్పుడు సమాచారం అని పీఐబీ పేర్కొనడం సోషల్ మీడియా వేదికల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది.
కానీ వాటిని నకిలీ వార్తలను ఎలా నిర్థరిస్తుందన్నది మాత్రం ఫ్యాక్ట్ చెక్ టీం ఎప్పుడూ వివరించలేదు.
కొన్నిసార్లు ఈ ఫ్యాక్ట్ చెక్ టీం వాట్సాప్లో ఫార్వార్డ్ సందేశాలను సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంది.
అలాగే, స్వయంగా ఫేక్ న్యూస్ లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకున్న సందర్భాలూ ఉన్నాయి. సరైన వార్తలను నకిలీ వార్తలని చెప్పడమూ జరిగింది.
ఉదాహరణలు:
1. 2020లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన ఒక రిక్రూట్మెంట్ నోటీసు 'నకిలీ'దని పీఐబీ చెప్పింది. తరువాత, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లికేషన్ విభాగం వాస్తవాలను తనిఖీ చేసి, ఆ రిక్రూట్మెంట్ నోటీసు సరైనదేనని తేల్చి చెప్పింది.
2. 2020 జూన్లో, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఒక ట్వీట్ చేసింది.
"కొన్ని యాప్లు వాడకూడదని ఎస్టీఎఫ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అది తప్పు. ఎస్టీఎఫ్ అలాంటి అడ్వైజరీ ఏదీ జారీ చేయలేదు" అని పేర్కొంది.
కానీ, ఆ అడ్వైజరీ వాస్తవమే. యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. "కొన్ని సాఫ్ట్వేర్స్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఫోన్లో సురక్షితమైన యాప్లు మాత్రమే వాడాలని హెచ్చరిస్తున్నాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ పీఐబీ ట్వీట్ తప్పుదోవ పట్టించిందని, ఫ్యాక్ట్ చెక్ టీం తప్పు చేసిందని పలువురు ఆరోపించారు. ఆ ట్వీట్ పోస్ట్ చేసి సుమారు రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అది అలాగే ఉంది. దాన్ని డిలీట్ చేయలేదు. దానిపై ఎలాంటి స్పష్టత లేదా సంజాయిషీ ఇవ్వలేదు.
3. 2020లో కరోనా సమయంలో శ్రామిక్ రైళ్లలో మరణాలకు సంబంధించిన నివేదికలు వచ్చినప్పుడు కూడా, ఎలాంటి పరిశోధన చేయకుండానే ఫాక్ట్ చెక్ టీం వాటిని నకిలీ వార్తలుగా పేర్కొంది.
ఆల్ట్ న్యూస్ వంటి వెబ్సైట్లు ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు వాస్తవాలు బయటికొచ్చాయి. ఎన్నో కథలు వెలుగులోకి వచ్చాయి.
అలాంటి వాటిలో ఇర్షాద్ అనే చిన్నారి కథ ఒకటి. తినడానికి ఏమీ దొరకక, పాలు కూడా లేక ఇర్షాద్ అనే నాలుగేళ్ల చిన్నారి మరణించాడు. రైలు ఎక్కినప్పుడు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని, తినడానికి, తాగడానికి ఏమీ దొరకని ప్రదేశాల్లో రైలు ఆగుతూ వచ్చిందని బాబు తండ్రి తెలిపారు. చివరికి రైలు ముజఫర్పూర్కు చేరుకున్నాక, అక్కడి నుంచి బయటికి వచ్చేందుకు వేచి చూస్తుండగా బాబు ప్రాణాలు విడిచాడని చెప్పారు.
ఈ కేసులో బాలుడు అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడని రైల్వే అధికారులు చెప్పారు. అలా అయితే, ఎలాంటి స్క్రీనింగ్, పరీక్షలు చేయకుండా అనారోగ్యంతో ఉన్నవారిని రైలు ఎక్కేందుకు ఎలా అనుమతించారన్న సందేహం తలెత్తుతుంది.
2020లో ఇదొక్కటే కాదు, ప్రభుత్వం తరఫు నుంచి పీఐబీ అందించిన వార్తలు తప్పుడు వార్తలని, ఫేక్ న్యూస్ అని నిరూపణ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
4. తపస్య అనే జర్నలిస్ట్ 'రిపోర్టర్స్ కలెక్టివ్' కోసం పనిచేస్తున్నారు. 2022 జూన్లో ఆమె ఒక కథనాన్ని అందించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహార పథకం అందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆ కథనంలో తెలిపారు. వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం ఆమె కథనాన్ని 'తప్పుడు వార్త'గా, 'ఫేక్ న్యూస్' గా పేర్కొంది. అలా చెప్పడానికి ఆధారాలుగానీ, వివరణ గానీ ఇవ్వలేదని తపస్య చెప్పారు. ఈ విషయాలన్నీ ఆమె ట్విటర్లో పంచుకున్నారు. కొత్త ప్రతిపాదనలు అప్లోడ్ చేసిన సందర్భంగా, తపస్య ఈ విషయాలన్నీ పంచుకుంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం ఇష్టానుసారంగా పనిచేస్తుందని అన్నారు.
పీఐబీ తపస్య కథనాన్ని ఫేక్గా పేర్కొన్నాక, ఆమె దీనిపై ఆర్టీఐ దాఖలు చేయగా, 2022 ఆగస్టులో 'పిల్లలకు ఆధార్ కార్డ్ అవసరం లేదని' మార్గదర్శకాలు జారీ చేసినట్టు తేలింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2022 మార్చిలో జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా తపస్య జూన్లో కథనం రాశారు. దాన్ని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ టీం ఫేక్ న్యూస్గా పేర్కొంది. కానీ ఆగస్టులోనే 'ఆధార్ కార్డ్ తప్పనిసరి' అన్న నియమాన్ని ఎత్తివేశారు. అంటే తపస్య కథనం రాసే సమయానికి 'ఆధార్ కార్డ్ తప్పనిసరి' అన్న నియమం ఉంది. ఆమె రాసిన వాస్తవాలను పీబీఐ ఫ్యాక్ట్ చెక్ టీం 'ఫేక్ న్యూస్'గా పేర్కొంది.
పీఐబీకి పెరుగుతున్న అధికారాలు మీడియాకి ముప్పుగా మారుతాయా?
పీఐబీకి పెరుగుతున్న అధికారాలు, బలం మీడియాకు ఎలా ముప్పుగా మారుతాయో తెలుసుకోవాలంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం పనితీరును గమనించాల్సిందే.
2020 ఏప్రిల్లో కారవాన్ పత్రిక ఒక నివేదికను అందించింది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మోదీ ప్రభుత్వం ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ను సంప్రదించలేదని ఆ నివేదిక సారాంశం.
అయితే, ఆ వార్త తప్పని, టాస్క్ ఫోర్స్ 14 సార్లు సమావేశమైందని ఐసీఎంఆర్ తెలిపింది. ఇదే విషయన్ని పీఐబీ ట్వీట్ చేస్తూ కారవాన్ కథనం ఫేక్ న్యూస్ అని తెలిపింది.
అయితే, ఆ కథనాన్ని రాసిన రిపోర్ట్, ఆ మీటింగ్ మినిట్స్ ఏంటి, మీటింగుల్లో ఏం మాట్లాడుకున్నారన్న సమాచారం అడిగితే ఏ సంస్థా బదులు ఇవ్వలేదు. ఎలాంటి సమాచారం అందించలేదు.
ప్రభుత్వాన్ని విమర్శించే లేదా మూలాధారాలతో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే కథనాలను, వార్తలను అనేకసార్లు నకిలీ వార్తలని, తప్పుదారి పట్టించే వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం పేర్కొంది.
ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ పాలసీ డైరెక్టర్ ప్రతీక్ వాఘ్రే 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'తో మాట్లాడుతూ, "పీఐబీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థ అయినా ఏదైనా వార్తను నకిలీదిగా పేర్కొంటే, ఆ వార్తను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని డ్రాఫ్ట్ చెబుతోంది. ఈ బాధ్యత సర్వీస్, ఇంటర్నెట్ ప్రొవైడర్దేనని కూడా చెబుతోంది. ఇది ప్రమాదకరం. ఎందుకంటే ప్రభుత్వానికి ఏదైనా వార్త నచ్చకపోతే, పీఐబీ ద్వారా దానిని ఫేక్ అని చెప్పేయొచ్చు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
- సముద్రంలో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారీ లైబ్రరీ
- 'నన్ను రేప్ చేసిన వ్యక్తి మాటలను నేను సీక్రెట్గా రికార్డ్ చేశాను'
- బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లుగా పిలిచే ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?
- స్విగ్గీబాయ్ రిజ్వాన్: అన్నయ్య ఐడీ మీద డెలివరీకి వెళ్లాడు, శవమై తిరిగొచ్చాడు... అసలేం జరిగింది?