నాడు గరీబీ హఠావో, ఇప్పుడు కనీస ఆదాయం.. ఇదీ అబద్దపు హామీయే: రాహుల్పై మాయావతి
లక్నో: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పైన బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళ వారం స్పందించారు. పేదరిక నిర్మూలపై రాహుల్ హామీ అంతా అబద్దమని విమర్శించారు. నల్లధనం పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ లాంటిదే రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ హామీ అన్నారు. హామీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అని నినాదం ఇచ్చిందని, కానీ అది నెరవేరలేదన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అటువంటిదేనని ఎద్దేవా చేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ర్యాలీలో ఆమె కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్క నాణేనిక ఉన్న రెండు ముఖాలు అన్నారు.
కాగా, లక్షలాది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పేదరికంతో మగ్గుతుంటే మనం కొత్త భారత్ను ఎలా సృష్టించగలమని, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరే పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం అనేది ఉండాలని, ఈ సార్వత్రిక కనీస ఆదాయం గురించి 2016-17లోనే భారత ఆర్థిక సర్వే చెప్పిందని, ఒక్కో వ్యక్తికి రూ.7,620 కనీస వార్షికాదాయం కల్పించాలని చెప్పిందని, 2019లో తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని రాహుల్ గాంధీ సోమవారం పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయాన్ని పురస్కరించుకొని రాయ్పూర్లో జరిగిన కిసాన్ అభార్ సమ్మేళనంలో రాహుల్ మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా పేదరికం, ఆకలి లేని భారత్ను సాకారం చేస్తామన్నారు.