ఇంటలిజెన్స్ వార్నింగ్: 'రిపబ్లిక్ డే' దాడులకు ఉగ్రవాదుల స్కెచ్..
కొద్దిరోజులుగా ఎవరి కంట పడకుండా ఢిల్లీలో మకాం వేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరిస్తోంది.
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలు దగ్గరపడుతుండటంతో దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఢిల్లీలోని కోర్టులపై దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
కొద్దిరోజులుగా ఎవరి కంట పడకుండా ఢిల్లీలో మకాం వేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చునని ఇంటలిజెన్స్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా తమ లక్ష్యాన్ని మార్చుకున్న ఉగ్రవాదులు.. కోర్టులతో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందంటున్నారు. దీనిపై ఢిల్లీ సీనియర్ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకల కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.