‘జోషిమఠ్’ తాజా విషయాలు అప్పుడే బయటపెట్టొద్దు: ఇస్రో ఫొటోల తర్వాత ఎన్డీఎంఏ
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ విషయంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జోషిమఠ్లో రెస్క్యూ, రిలీఫ్ పనిలో నిమగ్నమై ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను అలాగే జోషిమఠ్ ల్యాండ్ క్షీణత సంఘటన కారణాలు, ప్రభావాన్ని అధ్యయనం చేసి "సమీకృత" తుది నివేదిక వరకు తమ పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది.
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ కేవలం 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు మునిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నివేదిక విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
జోషిమఠ్లో పరిస్థితిని అధ్యయనం చేసి సిఫార్సులను అందించడానికి కేంద్రం ఇప్పటికే ఎన్డీఎంఏ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుండి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్డీఎంఏ శుక్రవారం సాయంత్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్లో.. "వివిధ ప్రభుత్వ సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో సబ్జెక్ట్కు సంబంధించిన డేటాను విడుదల చేస్తున్నాయని, వారు పరిస్థితిని వారి స్వంత వివరణతో మీడియాతో సంభాషించడాన్ని గమనించవచ్చు. ఇది బాధిత నివాసితులలోనే కాకుండా దేశ పౌరులలో కూడా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ అంశం జనవరి 12, 2023న కేంద్ర హోంమంత్రి (అమిత్ షా) అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైలైట్ చేయబడింది' అని పేర్కొంది.
నిపుణుల బృందం ఇప్పటికే సంఘటనను పరిశీలిస్తోందని, ఎన్డీఎంఏA సోషల్ మీడియాలో వివరాలను పంచుకోకుండా స్పష్టం చేసింది. కేవలం ముందు జాగ్రత్త కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తుది నివేదిక వచ్చే వరకూ వేచి చూడాలని తెలిపింది. కాగా, ఎన్డీఎంఏ లేఖ తర్వాత, ఇస్రో నివేదిక దాని వెబ్సైట్ నుంచి తీసివేశారు.