ఇస్రో రికార్డు: పీఎస్ఎల్వీ సీ-34తో ఒకేసారి 20శాటిలైట్లు నింగిలోకి
శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోనిసతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి పీఎస్ఎల్వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత్కు చెందిన కార్టోశాట్-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ,ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను బుధవారం ఉదయం 9.26 గంటలకు వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది.
రాకెట్ ప్రయోగం తర్వాత నింగిలోకి ఉప గ్రహాలు ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పటింది. ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి ఇస్రో సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఎంసీసీ నుంచి ఇస్రో అధిపతి కిరణ్కుమార్, సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు. 20 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపించి ఇస్రో సరికొత్త అధ్యాయానికి తెరతీసిందని షార్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ తెలిపారు.ఇస్రో చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు.
భవిష్యత్లో మరిన్ని గొప్ప ప్రయోగాలు చేయగలమన్న నమ్మకం ఉందన్నారు. పీఎస్ఎల్వీ విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు కున్హి కృష్ణన్ అభినందనలు తెలిపారు. మరినిన నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కాగా, ఐదేళ్లపాటు పీఎస్ఎల్వీ సీ34 ఐదేళ్లపాటు సేవలందించనుంది.
పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.