Joshimath : 12 రోజుల్లో జోషిమఠ్ ఎంత కుంగిపోయిందో తెలుసా ? ఇస్రో షాకింగ్ రిపోర్ట్.. !
ఉత్తరాఖండ్ లోని హిమాలయ సానువుల్లో ఉన్న జోషిమఠ్ ప్రాంతం గత కొంతకాలంగా కుంగిపోతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న 600 కుటుంబాల పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది. అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రంతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇన్నాళ్లు అక్కడే నివసించిన తాము ఎక్కడికీ వెళ్లేది లేదని స్ధానికులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జోషిమఠ్ లో పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం.. ఇస్రో సాయంతో పరిశోధనలు కూడా చేస్తోంది.
జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగిపోవడం వెనుక భూగర్బంలో చోటు చేసుకుంటున్న మార్పులేనని గమనించిన కేంద్రం.. ఇస్రో సాయంతో అక్కడ పరిశోధనలు చేయిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఇస్రో.. నిత్యం అక్కడ చోటు చేసుకుంటున్న మార్పుల్ని రికార్డు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోయినట్లు గుర్తించింది. ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీంతో జోషిమఠ్ లో పొంచి ఉన్న ప్రమాదం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సాయంతో ఇస్రో ఇక్కడ తాజా పరిస్దితిని అధ్యయనం చేస్తోంది. దీని ఆధారంగా జోషిమఠ్ లో ప్రజల తరలింపుకు కేంద్రానికి సూచనలు ఇవ్వబోతోంది. ఇప్పటికే జోషిమఠ్ ప్రజల్ని కనీసం నాలుగు నెలల పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం కోరుతోంది. ఈ నాలుగునెలల్లో నెలకు 4 వేల చొప్పున పెన్షన్ కూడా ఇస్తామని ప్రతిపాదిస్తోంది. అయినా జనం మాత్రం అక్కడి నుంచి కదలకపోవడంతో ప్రాణనష్టం తప్పదన్న అంచనాలు వెలువడుతున్నాయి.