కేజ్రీ.. ఈ ఖర్చుల కథేంది : కాంగ్రెస్, 91 రోజుల్లో 15 కోట్ల ఖర్చా..!
ఢిల్లీ : ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి.. అసలు కంటే కొసరుకే ఎక్కువ ఖర్చు పెడుతోన్నట్టుంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ సరి బేసి విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమలులో భాగంగా పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చుతో ఖజానాకు భారీగానే గండి పడిందని సమాచారం.
అమన్ అన్వర్ అనే న్యాయవాది.. కేజ్రీవాల్ ప్రభుత్వ ఖర్చులపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కావాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ఖర్చులు తడిసి మోపెడవుతున్నట్టుగా వెల్లడైంది. దీని ప్రకారం, గత ఫిబ్రవరి 10 నుంచి మే 11 వరకు కేజ్రీవాల్ సర్కార్ మొత్తం 14.96 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. అంటే.. 91 రోజుల్లోనే ఖజానా అంత భారీగా ఖాళీ అయిపోయిందన్న మాట.

అయితే.. ఈ డబ్బంతా, ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు. ఆయా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా ప్రభుత్వ పథకాల పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చు ఇది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోను ఈ ప్రకటనలు వెలువడడం. దీంతో ప్రభుత్వ దుబారా ఖర్చులపై దుమారం రేగుతోంది.
తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ పై మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు జీతాలే ఇవ్వలేని ప్రభుత్వం, పెన్షన్ల కోసం నెలల తరబడి డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం పార్టీ ప్రచారాలకు మాత్రం బాగానే డబ్బును వాడుకుంటుందని ఫైర్ అయ్యారు. మొత్తం 15 కోట్ల ఖర్చులో 5.39 కోట్లు సరి బేసి పబ్లిసిటీ కోసమే ఖర్చు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications