ఐటీ అధికారులే అవాక్కు: మంత్రి-మహిళా నేతల ఇళ్లలో 12 కిలోల గోల్డ్, రూ.162 కోట్లు
కర్నాటకలో ఓ మంత్రి ఇంటి పైన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐటీ అధికారులు చేసిన సోదాల్లో లెక్క చూపని సొమ్ము ఆయన నివాసంలో పట్టుబడిందని, దీంతో అధికారులు అవాక్కయ్యారు
బెంగళూరు: కర్నాటకలో ఓ మంత్రి ఇంటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇళ్ల పైన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఐటీ అధికారులు చేసిన సోదాల్లో లెక్క చూపని సొమ్ము వారి నివాసాల్లో పట్టుబడింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు.
సిద్ధరామయ్య కేబినెట్లో చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేశ్ జార్ఖిహొళి, పీసీసీ మహిళ విభాగం అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాళ్కర్ నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. ఇద్దరికి సంబంధించి లెక్కల్లో చూపని రూ.162 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
రమేష్ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఐటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో రూ.12 కిలోల బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరి ఇళ్లలో వీటిల్లో లెక్క చూపని డబ్బు దాదాపు రూ.162 కోట్లు గుర్తించారు. నగదుతోపాటు 12.8 కిలోల బంగారం, ఇతర స్వర్ణ, వజ్రాభరణాలు, అసలు వివరించలేకపోయిన రూ.41 లక్షల నగదునూ స్వాధీనం చేసుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటక, గోవా ప్రాంత ఆదాయ పన్ను శాఖకు చెందిన బెంగళూరు, గోవా, హుబ్బళ్లిలోని అధికారులు ఈ నెల 19న మంత్రి రమేశ్ జార్ఖిహోళి, ఆయన సోదరుడు లఖన్ జార్ఖిహోళి, బావ శంకర పావడే, స్థిరాస్తి వ్యాపారి జావేద్ ముల్లాలకు చెందిన ఆస్తులపై దాడి చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు లక్ష్మి హెబ్బాళ్కర్ నివాసం పైనా దాడి చేశారు. బెళగావి, గోఖక్, నిప్పాణి, బెంగళూరు, జావదిల్లోని నివాసాలపై మెరుపు దాడులను కొనసాగించారు. ఇద్దరు కీలక నేతల బెళగావి నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను అధికారులు వెల్లడించారు.
పన్నుల ఎగవేతలో ఇద్దరి విధానాల్లో సారూప్యతను అధికారులు గుర్తించారు. నకిలీ, తప్పుడు లెక్కలు, పద్దులను రాయటంలో ఇద్దరికీ ఒకే సంస్థ సాయపడినట్లు గుర్తించినట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా ఇద్దరూ రాజకీయంగా ప్రభావశీలురైనందున ఆచితూచి దాడులు నిర్వహించారు.
అక్రమాస్తుల్ని సృష్టించి వాటి నుంచి నిధులను చక్కెర మిల్లు నిర్మాణం తదితరాలకు మళ్లించారు. మంత్రికి సంబంధించి ఓ ప్రాంతంలో సోదాలు చేస్తుండగా లా అండ్ ఆర్డర్ సమస్య కూడా తలెత్తింది. కొందరు మంత్రికి అనుకూలంగా ఆందోళన చేయగా.. వెంటనే దానిని సద్దుమణిగేలా చేశారు. అనునయులు అల్లర్లకు దిగేందుకు చేసిన ప్రయత్నాలను ఉన్నతాధికారులు నివారించారని వివరించారు.