శశికళ ఫ్యామిలీ: కొనసాగుతున్న ఐటీ దాడులు, ఆర్థికంగా దెబ్బ, మన్నార్ గుడి టార్గెట్!
Recommended Video
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత చిన్నమ్మ వీకే శశికళ నటరాజన్ కుటుంబ సభ్యుల మీద మరోసారి ఆదాయపన్ను శాఖ (ఐటీశాఖ) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మొదలైన ఆదాయపన్ను శాఖ దాడులు గురువారం కొనసాగుతున్నాయి. మన్నార్ గుడి మాఫియాను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయని సమాచారం.
మన్నార్ గుడి మాఫియా టార్గెట్
శశికళ ఫ్యామిలీకి ఆర్థికంగా కేంద్ర బిందువు అయిన పాడపాయ్ ప్రాంతంలోని మిడాస్ మద్యం కంపెనీలో గురువారం ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. మిడాస్ కంపెనీకి చెందిన ఆర్థికలావాదేవీలను ఆదాయపన్ను శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గౌడన్ లో రహస్యం
చెన్నై సమీపంలో మిడాస్ మద్యం కంపెనీకి బాటిల్స్ సరఫరా చేసే గౌడన్ లో గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. మిడాస్ కంపెనీకి మద్యం బాటిల్స్, అట్ట బాక్స్ లు సరఫరా చేసే శ్రీసాయి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇళవరసి అల్లుడు
శశికళ వదిన ఇళవరసి కుమార్తె క్రిష్ణప్రియ భర్త కార్తికేయన్ కు చెందిన కోయంబత్తూరులోని ఎస్ వీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో గురువారం ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. శశికళ ఫ్యామిలీని లక్షంగా చేసుకునే ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగులు
శశికళ ఫ్యామిలీకి చెందిన కంపెనీలు, కాలేజ్ ల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.
ఆర్థికంగా దెబ్బ
శశికళ ఫ్యామిలీని లక్షంగా చేసుకుని ఇటీవల 187 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆ సందర్బంలో స్వాధీనం చేసుకున్న కొన్ని కీలకపత్రాలు పరిశీలించిన ఆదాయపన్ను శాఖ అధికారులు మరోసారి శశికళ ఫ్యామిలీకి చెందిన కంపెనీలు, కాలేజ్ ల్లో సోదాలు చేస్తున్నారని తెలిసింది.