శశికళ ఫ్యామిలీలో ఆ ముగ్గురే టార్గెట్: రూ. 30 వేల కోట్ల ఆస్తులు, ఢిల్లీకి నివేదిక, ఏం చెయ్యాలి !
శశికళ ఫ్యామిలీలో ఆ ముగ్గురే టార్గెట్, నోటీసులుచిన్నమ్మ ఫ్యామిలీకి రూ. 30 వేల కోట్ల ఆస్తులు, రూ. 1, 430 కోట్లు బినామీఢిల్లీకి ఐటీ శాఖ నివేదిక, 16 బ్యాంకు లాకర్లు సీజ్, కొడనాడులో కొనసాగుతున్న సోదాలు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే శశికళ నటరాజన్ కుటుంబంలో ఐటీ శాఖ అధికారులకు ముగ్గురు కీలకం అయ్యారు. శశికళ సోదరుడు దివాకరన్, ఆమె మేనకోడలు కృష్ణప్రియ, మేనల్లుడు వివేక్ కావడం గమనార్హం. శశికళ కుటుంబ సభ్యుల పేరిట రూ. 30 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఐటీ వర్గాల సోదాల్లో వెలుగు చూసింది.
ఆదాయపన్ను శాఖ సోదాల్లో శశికళ కుటుంబ సభ్యుల పేరిట రూ. 30 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ఐటీ శాఖ వర్గాలు ఢిల్లీకి ఓ నివేదిక పంపించండం ఇప్పుడు చర్చకు దారితీసింది. జయలలితకు చెందిన కొడనాడు గ్రీన్ టీ ఎస్టేట్ లో బుధవారం ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులు రాజకీయ ఒత్తిడితో జరగలేదని శశికళ మేనల్లుడు వివేక్ చెప్పడం కొసమెరుపు.

కొడనాడు ఎస్టేట్ టార్గెట్ !
కొడనాడు గ్రీన్ టీ ఎస్టేట్ లో ఐటీ శాఖకు చెందిన ఆరు మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. కొడనాడులోని అమ్మ జయలలిత, శశికళ గదుల్లో సోదాలు చెయ్యడానికి పై అధికారుల అనుమతి కోసం అక్కడ ఉన్న ఐటీ శాఖ అధికారులు వేచి చూస్తున్నారు. ఆ రెండు గదుల్లో సోదాలు చేస్తే మరెన్ని రికార్డులు వెలుగులోకి వస్తాయో అని ఉత్కంఠమొదలైంది.

రూ. 1, 430 కోట్ల అక్రమాస్తులు
శశికళ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ ఆదాయపన్ను చెల్లించకుండా రూ. 1, 430 కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించారని ఐటీ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అంతే కాకుండా 16 బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. బ్యాంకు లాకర్లు పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని చెన్నై అధికారులు ఢిల్లీకి నివేదిక పంపించారని తెలిసింది.

ఐటీ శాఖ టార్గెట్ వీరే
జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్, అతని సోదరి కృష్ణప్రియ, శశికళ సోదరుడు దివాకరన్ ఐటీ శాఖ అధికారుల మొదటి టార్గెట్ లో ఉన్నారు. తరువాత శశికళ సమీప బంధువులు డాక్టర్ శివకుమార్ (జయలలిత వ్యక్తి గత వైద్యుడు), జయ ఆనంద్, కార్తికేయన్, విక్రమ్, షకీలా, టీటీవీ దినకరన్ పేరిట అత్యధికంగా ఆస్తులు ఉన్నట్లు విచారణలో వెలుగు చూసింది.

విదేశాలకు చెక్కేయకుండా !
శశికళ కుటుంబ సభ్యులు విదేశాలకు చెక్కేయకుండా ముందుస్తుగా విమానాశ్రయాలకు ఐటీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది. ఇప్పటికే వీరి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇక వివేక్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న మూడు రివాల్వర్లలో రెండింటికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయని, మరో రివాల్వర్ కు లైసెన్స్ లేదని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

వివేక్ కు ప్రశ్నల వర్షం
శశికళ మేనల్లుడు వివేక్ కు ఐటీ శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది. కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చిన వివేక్ అనేక ప్రశ్నలకు సమాధానం దాటవేశారని సమాచారం. ఐటీ శాఖ అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, చట్టపరంగా ఆదాయపన్ను చెల్లించామని వివేక్ సమర్థించుకుంటున్నాడు. జాజ్ సినిమాస్ కు చెందిన ముగ్గురు అధికారులను ఐటీ శాఖ ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications