‘ఎస్పీ అవినీతి వాసన’: ఐటీ రైడ్స్, అఖిలేష్ పార్టీ నేత ఇంట్లో రూ. 150 కోట్లకుపైగా నోట్ల గుట్టలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత, వ్యాపారవేత్త అయిన ఒకరి ఇంట్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. ఏకంగా 150 కోట్ల రూపాయలకుపైగా బయటపడ్డాయి. సదరు వ్యాపారవేత్త భారీగా పన్నుఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.
ఆ ఎస్పీ నేత, వ్యాపారి ఇంట్లో నోట్ల గుట్టలు
ఆ వివరాల్లోకి వెళితే.. కాన్పూర్కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి గురువారం ఉదయం ఆదాయపుపన్ను శాఖ అధికారులు వెళ్లారు. అనంతరం ఇంట్లో సోదాలు జరిపారు. అనుమానాస్పదంగా కనిపించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నోట్ల కట్టలు ఉన్నాయి. దీంతో ఐటీ అధికారులు వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్ల కట్టలను లెక్కించారు.
రూ. 150 కోట్లకుపైనే.. నకిలీ కంపెనీలు, ఇన్వాయిస్లు
గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు నోట్ల కట్టలను లెక్కించగా ఏకంగా రూ. 150 కోట్లకుగాపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. ఈ సమాచారం అందుకున్న జీఎస్టీ అధికారులు కూడా వ్యాపారి నివాసానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంత భారీ సొమ్మును నకిలీ ఇన్వాయిస్ లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరుకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. ఊహాజనిత కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయిస్ లను సృష్టించి జీఎస్టీ, పన్ను చెల్లింపులు ఎగవేసినట్లు ఐటీ అదికారుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో పీయూష్ జైన్ ఇంటితోపాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిపారు. కాగా, ఓ వేర్ హౌస్ లో 200 నకిలీ ఇన్వాయిస్ లు ఉన్న నాలుగు ట్రక్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video
అఖిలేష్ పార్టీ అవినీతి వాసన అంటూ బీజేపీ చురకలు
పీయూష్ జైన్.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేత కావడం, అఖిలేష్ కు కూడా సన్నిహితుడు కావడంతో యూపీ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల సమాజ్ వాదీ పార్టీ పేరుతో పీయూష్ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలేష్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నోట్ల కట్టల ఫొటోలు, పర్ఫ్యూమ్ విడుదల ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ఎస్పీ అవినీతి వాసన' అంటూ చురకలంటిస్తున్నారు. ఇలాంటి అవినీతి వాసనను యూపీ ప్రజలు కోరుకోవడం లేదంటూ ఎస్పీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, యూపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీల మధ్య ప్రధాన పోటీ జరగనుంది.