మోడీ వచ్చిన మూడు రోజులకే!: ఐటీ దాడులు వ్యూహాత్మకమేనా.. ఆ భేటీ తర్వాత..
ప్రధాని నరేంద్ర మోడీ, డీఎంకె చీఫ్ కరుణానిధితో భేటీ అయిన మూడు రోజుల వ్యవధిలోనే చెన్నైలోని జయ టీవిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ, డీఎంకె చీఫ్ కరుణానిధితో భేటీ అయిన మూడు రోజుల వ్యవధిలోనే చెన్నైలోని జయ టీవిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
జయ టీవిపై ఐటీ దాడులు: మరో 160ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు..
ఐటీ దాడులు కాకతాళీయమే అనుకున్నప్పటికీ.. దీనికి మూడు రోజుల ముందు జరిగిన మోడీ పర్యటనను కూడా ముడిపెట్టి చూస్తున్న పరిస్థితి. తమిళనాడులో బలంగా ఉన్న అన్నాడీఎంకెను దెబ్బతీయడానికి అటు కేంద్రం, ఇటు డీఎంకె ఏమైనా చేతులు కలుపుతున్నాయా? అన్న అనుమానాలకు కూడా ఈ పరిణామాలు తావిస్తున్నాయి.
మోడీ-కరుణ భేటీ
తమిళనాడు దినపత్రిక దినతంతి 75వ వార్షికోత్సవం సందర్భంగా మోడీ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గత కొంతకాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదనే అంతా అనుకున్నారు. మోడీ వర్గం కూడా ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెప్పుకొచ్చింది. దాదాపు 10నిమిషాల పాటు వీరిద్దరి మధ్య భేటీ సాగినట్టు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో
2019లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బీజేపీ తమిళనాడుపై గట్టి ఫోకస్ పెట్టింది. అన్నాడీఎంకెను తమవైపు తిప్పుకునే క్రమంలో.. ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవడం బీజేపీకి చికాకు కలిగించింది. గ్రూపు రాజకీయాలతో సతమవుతున్న అన్నాడీఎంకెపై ప్రజల్లోను ఒకింత విశ్వసనీయత సడలిపోయింది. ముఖ్యంగా పార్టీని నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడం అన్నాడీఎంకెను దెబ్బతీసింది.
డీఎంకెతో పొత్తు కోసం
ఇటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకెకు దగ్గరవడం కంటే డీఎంకెతో చేయి కలపడమే బెటర్ అనే ఆలోచనకు బీజేపీ వచ్చి ఉండవచ్చు. ప్రాంతీయ పార్టీలను అధిగమించి తమిళనాడులో నెగ్గుకురావడం కష్టం కాబట్టి.. డీఎంకెతో పొత్తు ద్వారా తమిళనాడులో పాగా వేయాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరుణానిధితో మోడీ భేటీ అయ్యారనే వాదన కూడా ఉంది.
ఐటీ దాడులు వ్యూహాత్మకమేనా?
డీఎంకెకు దగ్గరవుతున్న నేపథ్యంలోనే.. అన్నాడీఎంకె శిబిరాన్ని విచ్చిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఐటీ దాడులను అస్త్రంగా ప్రయోగించినట్టు చెబుతున్నారు. మోడీ పర్యటన తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాడులు జరగడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఏదేమైనా తమిళనాడులో బీజేపీ ఒంటరిగా నెగ్గుకురావడం కష్టమనేది పరిశీలకుల అభిప్రాయం. కాబట్టి ఇప్పటినుంచే డీఎంకెతో కలిసి కసరత్తులు మొదలుపెట్టాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు.
అది సాధ్యమేనా?
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, జల్లికట్టు ఇతరత్రా విషయాల్లో ఇప్పటివరకు డీఎంకె బీజేపీని ఎటాక్ చేస్తూ వచ్చింది. అకస్మాత్తుగా మోడీ పర్యటనతో డీఎంకె వైఖరిలో మార్పు వస్తుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం. బీజేపీతో లెక్కలను బేరీజు వేసుకున్నాకే.. ఆ పార్టీకి దగ్గరగా జరిగే విషయాన్ని డీఎంకె పరిశీలించే అవకాశాలున్నాయి. మొత్తానికి మున్ముందు తమిళనాడు రాజకీయాలు మరింత రసకందాయంలో పడుతాయనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.