ఏం చేయలేక ఐటంగర్ల్లా: కేజ్రీపై చేతన్ భగత్ అసంతృప్తి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి)కి గట్టి మద్దతుదారు అయిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నా పైన స్పందించారు. రాజకీయాల్లో ఎఎపిని ఐటం గర్ల్గా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ నడి రోడ్డు పైన ధర్నాకు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ స్పందించారు.
కేజ్రీవాల్, ఆయన సహచరులు రెండు రోజుల పాటు చేసిన ధర్నాను చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. వారి ధర్నాతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నారు. వ్యాపారంపై ప్రభావం చూపిందన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు, ఇప్పటికిప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారని, అదేలా అంటే బాలీవుడ్లో ఒక నటి ఏమీ చేయలేని స్థితిలో ఐటమ్ గర్ల్గా మారిపోతుందని, అలానే రాజకీయాలల్ో ఎఎపి కూడా అలా మారిపోయిందన్నారు.
మరోవైపు ఎఎపి మద్దతుదారులపై ఢిల్లీ పోలీసులు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ సెంట్రల్ రైల్వే భవన్లో రెండు రోజుల పాటు ధర్నా చేసిన సమయంలో పోలీసులు విధించిన నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతో సెక్షన్ 144 కింద ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కేజ్రీవాల్ పేరును పేర్కొనలేదు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన యశోదా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల పాటు ధర్నా చేసి, అక్కడే నిద్రించడం వల్ల కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు.