సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు: దక్షిణభారత రాష్ట్రాలకు వెళ్లడంకన్నా పొరుగుదేశానికి వెళ్లడం మిన్న
పంజాబ్: మాజీ క్రికెటర్ పంజాబ్ కాంగ్రెస్ నేత మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొన్ని నెలల క్రితం పాకిస్తాన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లి వచ్చాక ఆయనపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా సిద్ధూకు ఆ వాసన పోనట్టుంది. అందుకే పదే పదే పాకిస్తాన్ను కలవరిస్తున్నారు. తాజాగా సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చాటుతుంది. దక్షిణ భారత దేశంలో పర్యటించడం కంటే పక్కనున్న పొరుగుదేశానికి వెళ్లడం చాలా సులభం అని అన్నారు సిద్ధూ. దక్షిణ భారతంలో భాషతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.
సిద్ధూ కౌగిలించుకున్న కొద్ది రోజులకే
కసౌలీ సాహిత్య వేడుకలో పాల్గొన్న సిద్ధూ దక్షిణ భారత రాష్ట్రాల గురించి మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో వణక్కం తప్ప తనకు ఇంకేమీ అర్థం కాదని చెప్పుకొచ్చారు. అయితే అక్కడి ఆహారం మాత్రం చాలా బాగుంటుందని కితాబిచ్చారు. అక్కడి ఇడ్లీలు చాలా బాగుంటాయి కానీ అదే పనిగా చాలారోజులు తినాలంటే తనవల్ల కాదంటూ తేల్చేశారు. ఇదిలా ఉంటే ఒకవేళ పాకిస్తాన్కు వెళితే అక్కడి ప్రజలు పంజాబీతో పాటు ఇంగ్లీషు కూడా మాట్లాడుతారు కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
సిద్దూ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ను కౌగలించుకున్న సిద్దూపై విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. అయితే భారత్లో నివసిస్తున్న సిక్కులకు పాకిస్తాన్లోని కర్తాపూర్ సాహిబ్ గురుద్వారాలోకి ప్రవేశం కల్పిస్తామని చెప్పడంతోనే తనను కౌగలించుకున్నట్లు సిద్దూ సమాధానంగా చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ నిజంగానే మాటమీద నిలబడితే ఈ సారి కౌగిలింత కాదు ఏకంగా మంచి ముద్దే పెడుతానని తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.