పాక్ బరితెగింపు: కాల్పుల్లో ఐదుగురి మృతి
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నాలుగు చోట్ల భారీ స్థాయిలో తుపాకులు, మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. ఫలితంగా సర్పంచి సహా ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత వృద్ధి చేసుకుందామని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పంపిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
బాలాకోటే సెక్టార్లో జరిగిన ఘటనలో ఒక మోర్టార్ గుండు.. కారును తాకింది. దీంతో అందులోని ముగ్గురూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో బసోని సర్పంచి కరామత్ హుస్సేన్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహ్మద్ షీరాజ్, 17 ఏళ్ల యువకుడు ఉన్నారు.

ఘటనా స్థలిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. వారిపై కూడా పాక్ జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. వీరిని జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. మహ్మద్ అమిన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
హమిర్పూర్ వద్ద పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో 9 ఏళ్ల బాలుడు కూడా చనిపోయాడు. మండి, సౌజియాన్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ కాల్పులు జరిగాయని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు. కాగా, ఆదివారం కూడా పాక్ దళాలు కాల్పులను కొనసాగిస్తోంది. భారత భద్రతా దళాలు పాక్ బలగాలకు ధీటుగా జవాబిస్తున్నాయి.












Click it and Unblock the Notifications