బీజేపీకి ఝలక్!: కాంగ్రెస్ సహకారంతో అధికారంలోకి పీడీపీ!
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో హంగ్ ఏర్పడనున్న నేపథ్యంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీతో (పీడీపీ) కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత బ్రిజేష్ కలప్ప విలేకరులతో మాట్లాడారు. తాము గతంలో పీడీపీతో కలిసి పని చేశామని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో కలిసి పని చేసే అవకాశముందన్నారు.
పీడీపీ కూడా బీజేపీకి షాకిచ్చింది. బీజేపీ కంటే కాంగ్రెస్తో పొత్తు మంచిదని పీడీపీ భావిస్తోంది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లలో ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తామని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ సహకారంతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ 26, పీడీపీ 32, కాంగ్రెస్ 11, నేషనలిస్ట్ కాంగ్రసె్ 12 స్థానాల్లో ముందంజలో లేదా గెలుపొందాయి.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక పక్షానికి ప్రజలు షాకిచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో విపక్ష పీడీపీ సహా బీజేపీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోన్వార్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ముందే ఊహించిన ఒమర్ సోన్వార్తో పాటు బీర్వా నియోజకవర్గం నుండి పోటీ చేశారు.
ఈ రెండు నియోజకవర్గాలు కాశ్మీర్ లోయకు చెందినవే కావడం గమనార్హం. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో సోన్వార్ల ఆయన ఓటమి పాలయ్యారు. బీర్వాలో వెనుకంజలో ఉన్నారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత ముఫ్తీ అనంత్ నాగ్ నియోజకవర్గంలో విజయం సాధించారు.
బీజేపీపై మాజీ మంత్రి సుభోద్ నిప్పులు
జార్ఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్న భారతీయ జనతా పార్టీ పైన మండిపడుతోంది. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ బ్లాక్ మనీని ఉపయోగించిందని కేంద్రమాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ఆరోపించారు.
ఎన్నికల్లో బ్లాక్ మనీని వినియోగించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ఎన్నికల్లో విజయమే పరమావధిగా బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారన్నారు.