హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణ స్వీకారం, హాజరైన బీజేపీ అగ్రనాయకత్వం
Recommended Video

సిమ్లా : హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎంగా జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. ఠాకూర్చే ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ ప్రమాణస్వీకారం చేయించారు. సిమ్లాలోని ప్రఖ్యాత రిడ్జ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిడ్జ్ మైదానంలో ఏర్పాటు చేసిన మోడీ, అమిత్ షా, జైరామ్ ఠాకూర్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సెరాజ్ నియోజకవర్గం నుంచి ఠాకూర్ గెలుపొందారు. ఈయన గతంలో కూడా మంత్రిగా పని చేశారు. 1998లో తొలిసారిగా జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలున్న హిమాచల్లో బీజేపీ 44 స్థానాలను గెలిచి తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రిడ్జ్ మైదానంలో నిర్వహించాలనే నిర్ణయంపై వివాదాలు తలెత్తాయి. పర్యావరణం పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
అయితే అన్ని వివాదాలకు తెరపడి చివరికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇదే మైదానం వేదికగా మారింది. 2008కి ముందు రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన బారన్స్ కోర్ట్లో ప్రమాణ స్వీకారం జరిగేది.
అయితే 2008లో అధికారంలోకి వచ్చిన ప్రేమ్కుమార్ ధుమాల్ మొదటిసారి రిడ్జ్ గ్రౌండ్స్ను ఇందుకు వేదిక చేయడంతో తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కూడా ఇదే మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు.
సిమ్లా రానున్న రాహుల్గాంధీ!
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా బుధవారం సిమ్లాకు రానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ వైఫల్యాల గురించి పార్టీ నేతలతో, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ చౌహాన్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications