ప్రముఖ జైన సన్యాసి తరుణ్ సాగర్(51) కన్నుమూత: మోడీ సహా ప్రముఖుల సంతాపం
న్యూఢిల్లీ: ప్రముఖ జైన మత సన్యాసి తరుణ్ సాగర్(51) కన్నుమూశారు. తూర్పు ఢిల్లీలోని కృష్ణానగర్లోని రాధాపురి జైనమందిరంలో శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

జైన మతంలో ప్రముఖుడిగా..
జైనమతంలో ప్రముఖుడిగా విశేష గుర్తింపు పొందిన ఆయన కామెర్లవ్యాధితో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారని తెలిసింది. ఆయన మృతిచెందారన్న విషయం తెలిసి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మోడీ, కేజ్రీవాల్ సంతాపం
జైనమత సన్యాసి తరుణ్సాగర్ ఉన్నత ఆదర్శాలు, సమాజాభివృద్ధికి అందించిన సహకారం దేశం మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. తరుణ్సాగర్ ఇక లేరనే వార్త వినడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన బోధించిన పాఠాలు, ఆదర్శాలు ఎల్లప్పుడూ మానవజాతిని ప్రభావితం చేస్తూనే ఉంటాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు కూడా సాగర్ మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించారు.
మోడీ సహా ప్రముఖులతో మంచి సంబంధాలు
తరుణ్సాగర్ అసలు పేరు పవన్కుమార్ జైన్. మధ్యప్రదేశ్లోని దామోశ్ జిల్లాలో 1967 జూన్ 26న ఆయన జన్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వంటి పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

తరుణ్ సాగర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణ కోరిన దద్లానీ
2016లో తరుణ్సాగర్ హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడంపై బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ విశాల్ దాద్లానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేగాక, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు, కోర్టు కేసులు ఎదుర్కోవడంతో దాద్లానీ ట్విట్టర్లో ఆయనకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత జైన సాధువును కలిసి క్షమాపణలు కోరారు.












Click it and Unblock the Notifications