ఆ 80కిలోల బంగారం ఎక్కడ?: సీబీఐ విచారణకు జైట్లీ ఓకే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న 80 కిలోల బంగారం మాయమైన ఘటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు రూ. 25కోట్ల విలువైన 80కిలోల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
కాగా, బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది.
బంగారం మాయమవడం వెనక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బంగారం మాయమైన ఘటనపై సీబీఐ విచారణకు ఆమోదం తెలిపారు.
కాగా, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల కాలంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోతున్న వారి సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. దీంతో భారీ ఎత్తున బంగారాన్ని కష్టమ్స్ అధికారులు సీజ్ చేస్తున్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న సరైన నిఘా లేకపోవడంతోనే బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.