గోవానే పారికర్ ప్రాణం, అందుకే మళ్లీ: సీఎంగా రేపే ప్రమాణం, రక్షణశాఖ జైట్లీకి
రక్షణశాఖ మంత్రి మనోహార్ పారికర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే.. గోవా ముఖ్యమంత్రిగా ఆయన మరోసారి కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
పనాజీ: రక్షణశాఖ మంత్రి మనోహార్ పారికర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే.. గోవా ముఖ్యమంత్రిగా ఆయన మరోసారి కొనసాగాలని నిర్ణయించుకున్నారు. గోవా అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసేందుకు వెనుకాడలేదు. గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే, గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేంద్రమంత్రిగా వెళ్లిపోతున్న సమయంలో పారికర్ కంటతడి పెట్టుకోవడం గమనార్హం. 2014 నవంబర్లో గోవా ముఖ్యమంత్రి పదవిని వీడేటప్పుడు మనోహర్ పారికర్ కన్నీరు పెట్టడం అప్పుడు సంచలనమైంది.

గోవానే ఆయన ప్రాణం
తనకు ఎంతో ఇష్టమైన రాష్ట్రాన్ని వీడి కేంద్ర పదవికి వెళ్లడం నాడు ఆయనకు ఇష్టంలేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు కూడా. కానీ పార్టీ ఆదేశాలను ఆయన శిరోధార్యంగా భావించారు. ఆరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 12-13ఏళ్ల క్రితం భార్యను కోల్పోయాను. ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వీడి వెళ్లడం చాలా కష్టంగా ఉంది' అని అన్నారు. కానీ, కాలం ఆయన్ను మళ్లీ గోవా తీరానికి చేర్చింది. దీంతో ఆయన మూడోసారి గోవా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమైపోయింది. కేంద్ర కేబినెట్లో నాలుగోస్థానంలో ఉండే రక్షణ మంత్రి పదవిని వదులకుని గోవా ముఖ్యమంత్రిగా రావడం విశేషం.

రేపే ప్రమాణం
అయితే, వాస్తవం ఏమిటంటే గోవాలో ఆయన్ను పార్టీలకు అతీతంగా నమ్మి, గౌరవించేవారు ఉన్నారు. ఇదే నేడు బీజేపీకి బలంగా మారింది. పారికర్ ఉంటేనే మద్దతు ఇస్తామని ఎంజీపీ, జీఎఫ్పీలు తేల్చిచెప్పాయి. దీంతో పారికర్ అంగీకరించడం.. ఆ పార్టీలు మద్దతు లేఖలు ఇవ్వడం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని గవర్నర్ను కోరడం 24గంటల్లో చకచకా జరిగిపోయాయి.

జైట్లీకి రక్షణశాఖ
గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మనోహర్ పారికర్ రక్షణశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి ఆయన రాజీనామాకు ఆమోదం కూడా జరిగిపోయింది. దీంతో రక్షణశాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. ప్రస్తుతం ఆయన అదనపు బాధ్యతగా రక్షణశాఖను నిర్వర్తించనున్నారు.

హోళీ సంబరాల్లో పారికర్
గోవాకు కాబోయే ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గోవాలో హోలీ సంబరాలు జరుపుకొన్నారు. పనాజీలోని పార్టీకార్యాలయలో ఆయన స్థానిక నేతలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ హాజరవుతారని తెలిపారు. గోవా గవర్నర్ మృదుల సిన్హా ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించారు. ప్రమాణస్వీకారం చేసిన 15రోజుల్లోపు బలనిరూపణ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి లేఖను విడుదల చేశారు. మంగళవారం పారికర్ గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications